న్యూఢిల్లీ: ఐడీ ప్రూఫ్ లేకుండా రూ.2,000 నోట్ల మార్పిడిని (Rs.2000 note exchange) అనుమతించవద్దంటూ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఎలాంటి గుర్తింపు పత్రాలు సమర్పించకుండా లేదా ఎలాంటి ఫార్మ్ నింపకుండానే రూ.2,000 నోట్లను బ్యాంకుల్లో మార్పిడి లేదా డిపాజిట్ చేసుకోవచ్చని భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ)తోపాటు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) స్పష్టం చేశాయి. ఈ నేపథ్యంలో న్యాయవాది, బీజేపీ నాయకుడు అశ్విని ఉపాధ్యాయ ఈ నిర్ణయాన్ని ఢిల్లీ హైకోర్టులో సవాల్ చేశారు. ఎలాంటి ఐడీ ప్రూఫ్ లేదా ఫార్మ్ పూరించకుండా రూ.2,000 నోట్ల మార్పిడి చేసుకోవచ్చన్న నిర్ణయం ఏకపక్షం, అహేతుకమని ఆరోపించారు.
కాగా, దేశ ప్రజలందరికీ ఆధార్ నంబర్తోపాటు ప్రతి భారతీయ కుటుంబానికి బ్యాంకు ఖాతా ఉన్నదని న్యాయవాది అశ్విని ఉపాధ్యాయ తెలిపారు. ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వమే ప్రకటించినట్లు గుర్తు చేశారు. ఈ నేపథ్యంలో రూ.2,000 నోట్లను మార్చుకోవడానికి ప్రజలు తమ గుర్తింపు పత్రాలను సమర్పించాలని బ్యాంకు అధికారులు కోరకపోవడానికి ఎలాంటి కారణం లేదన్నారు.
మరోవైపు రూ.2,000 కరెన్సీ నోట్లు ఎక్కువగా వేర్పాటువాదులు, ఉగ్రవాదులు, మావోయిస్టులు, మాదక ద్రవ్యాల స్మగ్లర్లు, మైనింగ్ మాఫియాలు, అవినీతిపరుల వద్ద ఉన్నాయని న్యాయవాది అశ్విని ఉపాధ్యాయ ఆరోపించారు. ఈ నేపథ్యంలో రూ.2,000 కరెన్సీ నోట్లను పెద్ద సంఖ్యలో మార్చుకునే వ్యక్తులను బ్యాంకు అధికారులు గుర్తించాలని తన పిటిషన్లో కోరారు.
ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి సతీష్ చంద్ర శర్మ, న్యాయమూర్తి జస్టిస్ సుబ్రమణియం ప్రసాద్లతో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్ను పరిశీలించింది. దీనిపై మంగళవారం విచారణ జరుపుతామని ధర్మాసనం పేర్కొంది.