అయోధ్య : అయోధ్య రామాలయంలో విరాళాల చోరీ ఉదంతం స్థానిక వ్యాపారులు, హోటళ్లపై పెను ప్రభావాన్ని చూపిస్తున్నది. చోరీ ఘటనకు ముందు రోజులతో పోలిస్తే భక్తుల సంఖ్య 25 శాతం తగ్గిపోయిందని రామ్పథ్లో గంధం, పూల దండలు అమ్మే వ్యాపారి తెలిపారు. గతంలో రోజుకు రూ.4-5 వేలు సంపాదించే ప్రసాదాల వ్యాపారి ఇప్పుడు వెయ్యి రూపాయలు సంపాదించడానికి కష్టాలు పడుతున్నాడు. తాను వాహన నిర్వహణ ఖర్చులను కూడా భరించలేకపోతున్నానని అజయ్ అనే ఈ-రిక్షా డ్రైవర్ తెలిపారు. అల్పాహార సమయంలో ఒక ప్రజాదరణ పొందిన హోటల్లో బల్లలన్నీ ఖాళీగా కనిపించాయి. గత 10 రోజులుగా వ్యాపారం తక్కువగా ఉందని అలాంటి హోటల్ మేనేజర్ ఒకరు తెలిపారు. మరోవైపు మధ్య స్థాయి హోటళ్లలో రూముల బుకింగ్ 25 శాతానికి పడిపోయింది. ప్రస్తుతం 100 కొత్త హోటళ్లు అయోధ్య చుట్టుపక్కల నిర్మాణంలో ఉన్నాయి. మతపరమైన పర్యాటకం త్వరగా కోలుకోకపోతే పెట్టుబడులపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది. చాలా మంది హోటల్ యజమానులు, చిరు వ్యాపారులు విరాళాల చోరీ ఘటన వల్లే తమ వ్యాపారాలు బాగా తగ్గిపోయాయని నమ్ముతున్నారు.
విరాళాల చోరీపై స్థానిక సాధువులు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశారు. శ్రీ హనుమత్ నివాస్కు చెందిన మిథిలేశనందిని శరణ్ ఈ విషయాన్ని వ్యవస్థ వైఫల్యంగా కాకుండా, పరిపాలనా వైఫల్యంగా పేర్కొన్నారు. మహంత్ కమల్ నయన్ దాస్ మాట్లాడుతూ కేవలం కొందరు కింది స్థాయి ఉద్యోగుల తప్పిదంగా దీన్ని అభివర్ణించారు. శంకరాచార్యులు, మఠాధిపతులకు ట్రస్ట్లో చోటు కల్పించాలని మహంత్ వివేక్ అచారి కోరారు. కొత్త ట్రస్ట్ను ఏర్పాటు చేయాలని ఒకరు డిమాండ్ చేశారు.
తొమ్మిది నెలల తర్వాత ఉత్తరప్రదేశ్ శాసనసభ ఎన్నికలు జరుగనున్నాయి. ఈ తరుణంలో విరాళాల చోరీ వివాదం విపక్షాలకు ప్రధాన రాజకీయ అంశంగా మారింది. దీంతో రామాలయాన్ని తమ సైద్ధాంతిక చిహ్నంగా కలిగిన బీజేపీ, ఆర్ఎస్ఎస్ నష్ట నివారణ ప్రచారాన్ని చేపట్టాయి. ఈ ఉదంతంపై సిట్ దర్యాపు కొనసాగుతున్నదని.. బాధ్యులపై కఠిన చర్యలుంటాయని.. ట్రస్ట్లో కీలక సంస్కరణలు ప్రవేశపెడుతారని ప్రజలకు చెప్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ సమస్య సద్దుమణగక ముందే ఎన్నికలు నిర్వహిస్తే రాజకీయ నష్టం వాటిల్లుతుందనే భయంతో ఎన్నికలను ముందుకు జరుపడానికి బీజేపీ సుముఖంగా లేదని సమాచారం.
అయోధ్య రామ మందిరం విరాళాల్లో అక్రమాలకు సంబంధించి ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) దేశవ్యాప్త సంతకాల సేకరణను చేపట్టింది. ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆప్ జాతీయ కన్వీనర్ కేజ్రీవాల్ డిమాండ్ చేశారు. ఆదివారం పార్టీ ఆధ్వర్యంలో సుందరకాండ పారాయణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కేజ్రీవాల్ మాట్లాడుతూ, రామ మందిరంలో జరిగిన ‘చందా-చోరీ’కి బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ ప్రధాని మోదీకి లేఖ రాస్తున్నామని, దేశ వ్యాప్తంగా నిర్వహించే ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొనాలని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు.