జైపూర్: ఆహారంలో మత్తుమందు కలిపి వ్యాపారవేత్త ఇంటి నుంచి కోట్ల విలువైన డబ్బులు, నగలను పనివాళ్లు దోచుకున్నారు. రాజస్థాన్లోని జోధ్పూర్లో ఈ సంఘటన జరిగింది. అశోక్ చోప్రా అనే వ్యాపారవేత్త దివ్యాంగుడు. లక్ష్మీ అనే మహిళ నాలుగేళ్ల కిందట ఆ వ్యాపారి ఇంట్లో పనిమనిషిగా చేరింది. వృద్ధురాలైన ఆయన తల్లి బాగోగులు చూసుకునేందుకు ఢిల్లీ కేంద్రంగా పనిచేసే ఏజెన్సీ నుంచి ఆమెను పనిలో పెట్టుకున్నారు. కొన్ని నెలల కింద ఆమె సిఫార్సుతో మరో ముగ్గురు పనివాళ్లు ఆ ఇంట్లో చేరారు.
కాగా, కోటీశ్వరుడైన వ్యాపారి అశోక్ చోప్రా ఇంటిని దోచుకునేందుకు ఆ నలుగురు పనివాళ్లు ప్లాన్ వేశారు. శనివారం ఆ కుటుంబం తినే ఆహారంలో మత్తుమందు కలిపారు. చోప్రా తల్లి, మనవరాలికి ఆ ఆహారం పెట్టలేదు. మిగతా కుటుంబ సభ్యులంతా ఆ ఆహారం తిని మత్తులోకి వెళ్లారు. అనంతరం పనివాళ్లు అక్కడి సీసీటీవీలను పగులగొట్టారు. ఆ ఇంట్లోని కోట్లాది డబ్బు, నగలు దోచుకున్నారు. ఆ కుటుంబ సభ్యుల మొబైల్ ఫోన్లు కూడా చోరీ చేశారు. బంగ్లా గేట్ను రిమోట్ కంట్రోల్ ద్వారా లాక్ చేశారు. వ్యాపారి చోప్రా కారులో అక్కడి నుంచి పారిపోయారు.
మరోవైపు ఈ దోపిడీపై ఫిర్యాదు అందుకున్న పోలీసులు వెంటనే రంగంలోకి దిగారు. నాగౌర్ జిల్లాలోని కుచమన్ ప్రాంతంలో నిందితులు వదిలేసిన వ్యాపారి కారును గుర్తించారు. ఆ నలుగురు వ్యక్తులు నేపాల్కు చెందిన వారని పోలీసులు తెలిపారు. ఢిల్లీ కేంద్రంగా పని చేస్తున్న ఏజెన్సీకి ఇద్దరు వ్యక్తులు తప్పుడు ధ్రువీకరణ పత్రాలు సమర్పించి ఆ ఇంట్లో ఉద్యోగం పొందినట్లు చెప్పారు. వ్యాపారి అశోక్ చోప్రా, ఆయన ఇద్దరు డ్రైవర్లు ఇంకా మత్తు నుంచి కోలుకోలేదని వివరించారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.