Dombivli blast : మహారాష్ట్రలోని థానే పట్టణంలోగల డోంబివిలీ ఏరియాలో ‘అముదన్ కెమికల్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ’ బాయిలర్లో గురువారం జరిగిన పేలుడు పెను విషాదాన్ని మిగిల్చింది. ఈ పేలుడు ఘటనలో మృతుల సంఖ్య ఇప్పటికే 11 కు చేరింది. మరో 60 మందికిపైగా గాయాలపాలై వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఘటనా ప్రాంతంలో ఇంకా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
పేలుడు ధాటికి కూలిన భవన శిథిలాలను సహాయ సిబ్బంది తొలగిస్తున్నారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. కాగా పేలుడు సంభవించిన ‘అముదన్ కెమికల్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ’కి ముంబైకి చెందిన మాలతీ ప్రదీప్ మెహతా, అమె కుమారుడు మలాయ్ ప్రదీప్ మెహతా యజమానులుగా ఉన్నారు. ఫ్యాక్టరీ నిర్వహణ లోపాల కారణంగా పేలుడు సంభవించడంతో పోలీసులు యజమానులపై కేసు నమోదు చేశారు.
నిన్నటి నుంచి పరారీలో ఉన్న మాలతీ ప్రదీప్ మెహతా (70) ను ఇవాళ నాసిక్లో అరెస్ట్ చేశారు. ఆమె కుమారుడు మలాయ్ ఇంకా పరారీలోనే ఉన్నారు. అతని ఆచూకీ కోసం పోలీసులు గాలిస్తున్నారు.