Dombivli blast : మహారాష్ట్రలోని థానే పట్టణంలోగల డోంబివిలీ ఏరియాలో ‘అముదన్ కెమికల్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ’ బాయిలర్లో గురువారం జరిగిన పేలుడు పెను విషాదాన్ని మిగిల్చింది. ఈ పేలుడు ఘటనలో 11 మంది మరణించారు. మరో 60 మందికిపైగా గాయపడ్డారు. క్షతగాత్రులంతా ప్రస్తుతం వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.
ఈ పేలుడు కేసులో పోలీసులు ‘అముదన్ కెమికల్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ’ యజమానులు ఇద్దరిని నిందితులుగా చేర్చారు. ముంబైకి చెందిన తల్లీ కొడుకులు మాలతీ ప్రదీప్ మెహతా, మలయ ప్రదీప్ మెహతా కెమికల్ కంపెనీకి యజమానులుగా ఉన్నారు. గురువారం పేలుడు జరిగిన అనంతరం నిందితులిద్దరూ పారిపోయారు. అయితే మాలతీ మెహతా (70) ని శుక్రవారం సాయంత్రం నాసిక్లో అరెస్ట్ చేశారు.
ఇవాళ ఆమె కుమారుడు, కేసులో ప్రధాన నిందితుడు మలయ ప్రదీప్ మెహతాను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులిద్దరిని ఇవాళ కోర్టులో ప్రవేశపెట్టనున్నారు.