శ్రీనగర్: షారూఖ్ ఖాన్, దీపకా పడుకోన్ జంటగా నటించిన పఠాన్ సినిమా విడుదలకు ముందే వివాదాల్లో చిక్కుకుంది. ఆ సినిమాలో ఓ పాటకు దీపికా పడుకోన్ అసభ్యంగా కాషాయ దుస్తులు ధరించి ఉండటంపై బీజేపీ నేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆ వివాదంపై జమ్ముకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి, నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ సీనియర్ నేత ఫరూఖ్ అబ్దుల్లా స్పందించారు.
రంగులు ఏ మతానికి సొంతం కాదని, అన్ని రంగులపై అందరికీ హక్కులుంటాయని ఫరూఖ్ అబ్దుల్లా వ్యాఖ్యానించారు. పఠాన్ సినిమాలో కాషాయ దుస్తులపై బీజేపీ వివాదం రాజేయడం విడ్డూరంగా ఉందన్నారు. కాషాయం రంగు హిందువులకు, ఆకుపచ్చ రంగు ముస్లింలకు సొంతమా..? అని ఫరూఖ్ అబ్దుల్లా ప్రశ్నించారు. ఏంటిది..? ఆవు హిందువులది అయితే ఎద్దు ముస్లింలదా..? అని నిలదీశారు.
అదేవిధంగా జమ్ముకశ్మీర్ నుంచి ఆర్టికల్ 370 తొలగింపుపై కూడా ఫరూఖ్ అబ్దుల్లా మాట్లాడారు. ఆర్టికల్ 370 తొలగింపుతో కశ్మీర్లో ఉగ్రవాదం అంతమవుతుందని కేంద్రం చెప్పిందని, ఆర్టికల్ను తొలగించి ఏండ్లు గడుస్తున్నా ఉగ్రవాదం ఎందుకు అంతం కావడం లేదని ఆయన ప్రశ్నించారు.