శ్రీనగర్: అప్పులు ఎగ్గొట్టేందుకు కుటుంబంతో సహా రోడ్డు ప్రమాదంలో మరణించినట్లు నమ్మించేందుకు ఒక వ్యక్తి ప్రయత్నించాడు. అయితే అతడి ప్లాన్ బెడిసికొట్టింది. జమ్ముకశ్మీర్లోని దోడా జిల్లాలో ఈ సంఘటన జరిగింది. మంజీత్ సింగ్ అనే వ్యక్తి వ్యాపారం కోసం బ్యాంకులు, ఇతరుల నుంచి 30 లక్షల వరకు రుణాలు తీసుకున్నాడు. అయితే అప్పులు ఎగ్గొట్టేందుకు అతడు ఒక ప్లాన్ వేశాడు. గత ఏడాది డిసెంబర్ 20న భార్య సోనియా దేవి, కుమార్తెతో కలిసి కారులో ప్రయాణించాడు.
కాగా, దోడాలోని గడ్సూ ప్రాంతం సమీపంలోని చీనాబ్ నదిలో ఒక కారు పడినట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో అతి కష్టం మీద ఆ వాహనాన్ని నది నుంచి బయటకు తీశారు. విరిగిన నంబర్ ప్లేట్, ఐడీ కార్డులు, డ్రైవింగ్ లైసెన్స్ ఆధారంగా ఆ వాహనం మంజీత్ సింగ్కు చెందినగా గుర్తించారు. భాదేర్వాలోని కుమారుడి వద్దకు కుటుంబంతో కలిసి అతడు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులకు తెలిసింది. ఈ నేపథ్యంలో మంజీత్ సింగ్, అతడి భార్య, కుమార్తె కోసం ఆ నదిలో గాలింపు చర్యలు చేపట్టారు. అయితే ఎవరి మృతదేహాలు లభించలేదు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
మరోవైపు మంజీత్ సింగ్ గురించి పూర్తి వివరాలను పోలీసులు సేకరించారు. పలు బ్యాంకులతోపాటు పలువురి నుంచి సుమారు రూ.30 లక్షల వరకు రుణాలు తీసుకున్నట్లు తెలిసింది. ఆర్థిక సమస్యల వల్ల రుణ వాయిదాలను అతడు చెల్లించకపోవడం గురించి కూడా తెలుసుకున్నారు. ఈ నేపథ్యంలో కుటుంబంతో సహా అతడు అదృశ్యం కావడంపై పోలీసులు అనుమానించారు. సీసీటీవీ ఫుటేజ్లను పరిశీలించడంతోపాటు సాంకేతిక ఆధారాల ద్వారా దర్యాప్తు చేశారు.
కాగా, హర్యానాలోని పంచకుల జిల్లా అభయ్పురా గ్రామంలో మంజీత్ సింగ్, అతడి కుటుంబ సభ్యులు ఉన్నట్లు పోలీసులకు తెలిసింది. ఈ నేపథ్యంలో హర్యానా పోలీసుల సహకారంతో వారిని అదుపులోకి తీసుకున్నారు. అక్కడి నుంచి జమ్ముకశ్మీర్కు తరలించారు. మంజీత్ సింగ్, అతడి కుటుంబం మిస్సింగ్ను 24 గంటల్లో చేధించినట్లు జమ్ముకశ్మీరర్ పోలీసులు తెలిపారు. పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.