లక్నో: అప్పుడే పుట్టిన నవజాత శిశువును రాజకీయ నేతకు డాక్టర్లు విక్రయించారు. (Selling Newborn To Politician ) బిడ్డ చనిపోయినట్లు కన్న తల్లికి చెప్పారు. అయితే ఏదో మోసం జరిగినట్లు గ్రహించిన మహిళ దీని గురించి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలో ఇద్దరు డాక్టర్లను అరెస్ట్ చేశారు. ఉత్తరప్రదేశ్లోని బలరామ్పూర్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. జొవ్వా గ్రామానికి చెందిన జై జైరామ్ భార్య పుష్పాదేవి అక్టోబర్ 29న డెలివరీ కోసం పచ్పేద్వాలోని మిషన్ హాస్పిటల్లో చేరింది. డాక్టర్ అక్రమ్ జమాల్, డాక్టర్ హిఫ్జుర్ రెహమాన్ ఇటీవల పుష్పాదేవికి సిజేరియన్ ఆపరేషన్ చేశారు. దీంతో ఒక బిడ్డకు ఆమె జన్మనిచ్చింది.
కాగా, బద్నీ నగర్ పంచాయతీ వార్డు నంబర్ 2 కౌన్సిలర్ నిసార్కు ఆ నవజాత శిశువును డాక్టర్లు అమ్మేశారు. పుష్పాదేవి స్పృహలోకి వచ్చిన తర్వాత బిడ్డ చనిపోయినట్లు ఆమెకు తెలిపారు. అయితే తన బిడ్డ బతికే ఉందని, తనకు అప్పగించాలని ఆమె పట్టుబట్టింది. డిశ్చార్జ్ తర్వాత పలుసార్లు ఆసుపత్రికి వెళ్లి తన బిడ్డను ఇవ్వాలని డిమాండ్ చేసింది. ఆసుపత్రి సిబ్బంది స్పందించకపోవడంతో పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది.
మరోవైపు పోలీసులు ఈ సంఘటనపై దర్యాప్తు జరిపారు. పుష్పాదేవికి డెలివరీ చేసిన డాక్టర్ అక్రమ్ జమాల్, డాక్టర్ హిఫ్జుర్ రెహమాన్పై అనుమానం వ్యక్తం చేశారు. వారిద్దని అరెస్ట్ చేసి ప్రశ్నించారు. నవజాత శిశువును కౌన్సిలర్ నిసార్కు విక్రయించినట్లు తెలుసుకున్నారు. కౌన్సిలర్ ఇంటి నుంచి ఆ బిడ్డను స్వాధీనం చేసుకుని తల్లికి అప్పగించారు. నేపాల్కు పారిపోయిన కౌన్సిలర్ను అరెస్ట్ చేసేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.