న్యూఢిల్లీ: కోవిడ్ చికిత్స కోసం కేంద్రం కొత్త మార్గదర్శకాలను రిలీజ్ చేసింది. స్వల్ప, మధ్య, తీవ్ర లక్షణాలు ఉన్నవారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో కోవిడ్ టాస్క్ ఫోర్స్ వెల్లడించింది. కోవిడ్19 రోగులకు స్టిరాయిడ్స్ ఇవ్వడం ఆపేయాలని డాక్టర్లకు నీతి ఆయోగ్ టాస్క్ ఫోర్స్ చీఫ్ డాక్టర్ వీకే పౌల్ సూచించారు. సెకండ్ వేవ్ సమయంలో స్టిరాయిడ్స్ను అధికంగా వాడినట్లు ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. స్టిరాయిడ్స్తో సెకండరీ ఇన్ఫెక్షన్ పెరుగుతుందని, సుదీర్ఘకాలం ఎక్కువ డోసులో స్టిరాయిడ్స్ను వాడితే బ్లాక్ ఫంగస్ లాంటి వ్యాధులు వచ్చే ప్రమాదం ఉందన్నారు. ఒకవేళ రెండు లేదా మూడు వారాల కన్నా ఎక్కువ సమయం దగ్గు వస్తుంటే, అప్పుడు టీబీ పరీక్షలు చేయించుకోవాలని వీకే పౌల్ సూచించారు.
ఊపిరి సమస్యలు లేకుండా కేవలం శ్వాసకోస సంబంధిత సమస్యలు ఉంటే వాటిని స్వల్ప లక్షణాలుగా పరిగణించాలి. వాళ్లు కేవలం హోమ్ ఐసోలేషన్లో ఉంటే సరిపోతుంది. ఇక మధ్య తరహా లక్షణాలు ఉన్నవారు.. శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిపడితే, జ్వరం అధికంగా ఉంటే, 5 రోజుల కన్నా ఎక్కువ కాలం దగ్గు కొనసాగితే, అప్పుడు వాళ్లు వైద్యుల్ని సంప్రదించాలి. ఆక్సిజన్ లెవల్ 90-93 మధ్య ఉంటే వాళ్లను మాడరేట్ కేసులుగా భావిస్తారు. వారికి ఆక్సిజన్ సపోర్ట్ ఇవ్వాలి. ఇక ఆక్సిజన్ లెవల్ 90 కన్నా తక్కువగా ఉంటే వారిని తీవ్ర లక్షణాలు ఉన్న వ్యక్తిగా పరిగణించాలి. అలాంటి వాళ్లను తక్షణమే ఐసీయూలో చేర్పించాలి.
మధ్య, తీవ్ర తరహా కరోనా లక్షణాలు ఉన్నవారికి రెమిడిసివిర్ ఔషధాన్ని ఇవ్వవచ్చు అని కొత్త మార్గదర్శకాల్లో సూచించారు. మూత్ర సంబంధిత వ్యాధులు ఉన్నవారికి, ఆక్సిజన్ సపోర్ట్పై లేని వారికి ఈ ఔషధాన్ని ఇవ్వకూడదు. ఇక తీవ్ర వ్యాధి లక్షణాలు ఉన్నవారికి 48 గంటలలోపు టోసిలిజుమాబ్ డ్రగ్ను ఇవ్వవచ్చు అని కొత్త గైడ్లైన్స్లో తెలిపారు.