ముంబై : కరోనా సెకండ్ వేవ్ విరుచుకుపడుతూ పలువురి ప్రాణాలను హరిస్తోంది. ముంబైలో ఓ సీనియర్ మహిళా డాక్టర్ కొవిడ్ తో పోరాడుతూ కన్నుమూశారు. ఆమె తనువు చాలించేందుకు 36 గంటల ముందు ఫేస్ బుక్ ఖాతాలో చేసిన పోస్ట్ పలువురిని కంటతడి పెట్టిస్తోంది. ఇదే చివరి గుడ్ మార్నింగ్ అంటూ ఆమె ఆ పోస్ట్ లో రాసుకొచ్చారు. 51 ఏండ్ల డాక్టర్ మనీషా జాదవ్ చికిత్స నిమిత్తం ఐసీయూలో చేరారు.
సెవ్రీ టీబీ ఆస్పత్రిలో సీనియర్ మెడికల్ అధికారిగా ఆమె పనిచేస్తున్నారు. ఐసీయూ బెడ్ నుంచి ఆమె సోషల్ మీడియా ఖాతాలో..ఇక ఈ వేదికపై నేను మిమ్మల్ని కలవలేకపోవచ్చు..ఇదే చివరి గుడ్ మార్నింగ్..అందరూ జాగ్రత్తలు పాటించండి..శరీరం మరణించినా ఆత్మ నశించదని రాసుకొచ్చారు.మరోవైపు కొవిడ్-19తో గత ఏడాది మార్చి నుంచి ముంబైలో ఇప్పటివరకూ 18,000 మంది వైద్యులకు కొవిడ్ సోకగా 168 మంది మరణించారు.