Viral news | ఉత్తరప్రదేశ్లో షాకింగ్ ఘటన ఒకటి చోటు చేసుకుంది. ప్రసవం కోసం ఆసుపత్రికి వచ్చిన ఓ మహిళకు ఆపరేషన్ చేసిన వైద్యులు.. ఆమె కడుపులో టవల్ పెట్టి మరిచిపోయి కుట్లు వేసేశారు. వివరాల్లోకి వెళితే..
అమ్రోహ్ (Amroha) జిల్లా బాన్స్ ఖేరీ ( Bans Kheri) గ్రామానికి చెందిన నజ్రానా (Nazrana) అనే మహిళ.. ఇటీవల పురిటి నొప్పులతో సైఫీ నర్సంగ్ హోమ్ (Saifee Nursing Home)లో చేరింది. అక్కడ ఆమెకు వైద్యులు ఆపరేషన్ చేశారు. ఆ సమయంలో ఆమె కడుపులో టవల్ పెట్టి మర్చిపోయి కుట్లు వేసేశారు. వైద్యులు చేసిన ఈ నిర్లక్ష్యపు పనికి నజ్రానా నొప్పి భరించలేకపోయింది. కడుపులో నొప్పి అని వైద్యులకు చెప్పగా.. వాతావరణం చల్లగా ఉండటం వల్ల అలా అనిపిస్తోందని చెప్పారు. ఐదు రోజులు ఆసుపత్రిలో చికిత్స తీసుకోమని సూచించారు.
ఐదురోజుల తర్వాత డిశ్చార్జి అయ్యి ఇంటికి వెళ్లిన నజ్రానాకు కడుపునొప్పి మాత్రం తగ్గలేదు. ఒకానొక సమయంలో తీవ్రమైన నొప్పి రావడంతో నజ్రానాను ఆమె భర్త శంషేర్ అలీ స్థానికంగా ఉన్న మరో ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లగా అసలు విషయం బయటపడింది. బాధితురాలిని పరీక్షించిన వైద్యులు ఆమె కడుపులో టవల్ ఉన్నట్లు గుర్తించారు. అనంతరం ఆపరేషన్ చేసి టవల్ను తొలగించారు.
ఈ ఘటనపై చీఫ్ మెడికల్ ఆఫీసర్ (సీఎంవో) రాజీవ్ సింఘాల్కు బాధిత కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. ఆసుపత్రి వైద్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఫిర్యాదుపై స్పందించిన సీఎంవో.. ఘటనపై విచారణకు ఆదేశించారు. విచారణ అనంతరం పూర్తి వివరాలు వెల్లడిస్తామని తెలిపారు.