తమిళనాడులోని కూనూర్లో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో భారత సీడీఎస్ జనరల్ బిపిన్ రావత్ కన్నుమూశారు. ఈ ప్రమాదంలో రావత్ భార్య మధులికతోపాటు పలువురు అధికారులు కూడా మరణించారు.
ఉత్తరాఖండ్లోని పారీ ప్రాంతంలో రావత్ జన్మించారు. నాలుగు తరాలుగా వారి కుటుంబం నుంచి ఎవరో ఒకరు దేశ సేవ చేస్తూనే ఉండటం గమనార్హం. ఈ క్రమంలో ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కోవడంలో బిపిన్ రావత్కు ఆయన భార్య డాక్టర్ మధులిక ఎంతో సహకరించారు.
మధ్యప్రదేశ్లోని సెహడోల్ ప్రాంతంలో కాంగ్రెస్ మాజీ నేత కువర్ మృగేంద్ర సింహ్ కుమార్తె మధులిక. బిపిన్ రావత్తో వివాహం అనంతరం.. ఆర్మీ అధికారులు భార్యల సంక్షేమం కోసం ఏర్పాటు చేసిన ఆర్మీ వైవ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ (అవ్వ) అధ్యక్షురాలిగా కూడా ఆమె సేవలందించారు. ఆర్మీ అధికారుల కుటుంబ సభ్యుల సంక్షేమం కోసం ఆమె కృషి చేశారు.
ఢిల్లీ యూనివర్సిటీ నుంచి సైకాలజీలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన ఆమె.. మరణించిన ఆర్మీ అధికారుల భార్యలు, క్యాన్సర్ పేషెంట్లు, దివ్యాంగులైన చిన్నారుల కోసం జరిగిన ఎన్నో క్యాంపెయిన్లలో ఆమె పాల్గొన్నారు.
రావత్ దంపతులకు ఇద్దరు పిల్లలు. ఇద్దరూ అమ్మాయిలే. పెద్ద కుమార్తె కృతికకు వివాహమైంది. ఆమె కుటుంబం ప్రస్తుతం ముంబైలో నివసిస్తోంది. రెండో కుమార్తె తరుణి చదువుకుంటోంది. బిపిన్ రావత్ తండ్రి లక్ష్మణ్ సింగ్ రావత్ కూడా భారత ఆర్మీలో పనిచేశారు. లెఫ్టినెంట్ జనరల్ హోదా కూడా పొందారు. రావత్ తల్లి ఉత్తరకాశీ మాజీ ఎమ్మెల్యే కిషన్ సింగ్ పార్మర్ కుమార్తె.
వెల్లింగ్టన్లోని డిఫెన్స్ సర్వీసెస్ స్టాఫ్ కాలేజిలో ఉపన్యసించేందుకు భార్యతో కలిసి వెళ్తున్న సమయంలోనే రావత్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ కూలిపోయింది. కూనూర్ సమీపంలో జరిగిన ఈ ప్రమాదంలో ఈ దంపతులిద్దరూ కన్నుమూశారు.