న్యూఢిల్లీ, జనవరి 8: హరిద్వార్, ఢిల్లీల్లో ఇటీవల జరిగిన ధర్మ సంసద్ కార్యక్రమాల్లో కొంత మంది చేసిన ద్వేషపూరిత ప్రసంగాలు స్వామి వివేకానంద బోధనలకు పూర్తి విరుద్ధమని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. ప్రజల మధ్య చీలికలు, మతపరమైన ఉద్రిక్తతలు సృష్టించే ప్రయత్నాలు చేస్తే చట్టం తన పని తాను చేయాలని, అందుకు సహకరించాలని, అనుమతించాలని కోరారు. ఇటువంటి ప్రసంగాలను ప్రజలు తిరస్కరించాలని, వాటికి ఎలాంటి ప్రాముఖ్యం ఇవ్వవద్దని ఓ ఇంటర్వ్యూలో గడ్కరీ కోరారు. ‘సహనం, సరళత, అందరినీ కలుపుకొనిపోవడంపై మన(హిందూ) మతం ఆధారపడి ఉంది. మన రాజులు ఎవరి ప్రార్థనా మందిరాలను ధ్వంసం చేయలేదు. మేం విస్తరణ వాదులం కాదు. మాకు మంచి కావాలి. ప్రపంచమంతా మంచిగా ఉండాలని కోరుకొంటాం. భూమిపై ఉన్న ప్రతీ ప్రాణి బాగుండాలని కోరుకొంటాం. ఇది మా వారసత్వం. ఇదీ మా దృక్కోణం. దీనికి విరుద్ధంగా వ్యవహరించేవారు మాలోని వారు కాదు’ అని వ్యాఖ్యానించారు. షికాగోలో సర్వ మత సమ్మేళనంలో వివేకానంద కూడా ఇదే చెప్పారని గడ్కరీ ఈ సందర్భంగా పేర్కొన్నారు. హరిద్వార్ ధర్మ సంసద్లో హిందూ మత గురువులు కొంత మంది.. ముస్లింలను ఊచకోత కోయాలని బహిరంగంగా పిలుపునిచ్చారు. ఈ కేసులో ఇప్పటివరకు కేవలం ఐదుగురిపై మాత్రమే కేసు నమోదు అయింది.