చెన్నై: వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే 200 స్థానాల్లో కచ్చితంగా విజయం సాధిస్తుందని ఆ పార్టీ అధినేత ఎంకే స్టాలిన్ కుమారుడు ఉదయనిధి స్టాలిన్ ధీమా వ్యక్తంచేశారు. అంతేగాక ఎన్నికల ప్రచారంలో భాగంగా తాము తప్పకుండా జయలలిత మరణం గురించి మాట్లాడుతామని ఆయన స్పష్టంచేశారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో డీఎంకే నాయకులు జయలలిత మరణం గురించిన ప్రస్తావన తేకుండా అదేశాలు ఇవ్వాలంటూ ఇటీవల అన్నాడీఎంకే కేంద్ర ఎన్నికల సంఘాన్ని కోరింది. ఈ నేపథ్యంలో ఉదయనిధి మారన్ ప్రచారంలో జయలలిత మరణం గురించి తప్పక ప్రస్తావిస్తామని నొక్కి చెప్పారు.
అదేవిధంగా ప్రముఖ నటుడు కమలాహాసన్ పార్టీ గురించి కూడా ఉదయనిధి స్టాలిన్ కీలక వ్యాఖ్యలు చేశారు. కమలాహాసన్ గురించి తాము ఈ ఎన్నికల్లో ఎలాంటి కామెంట్లు చేయబోమని చెప్పారు. కమలాహాసన్ నేతృత్వంలోని ఎంఎన్ఎం పార్టీ తమకు అసలు పోటీయే కాదని ఆయన వ్యాఖ్యానించారు. ఈసారి డీఎంకే, అన్నాడీఎంకే పార్టీలు రెండింటికీ తమిళ ప్రజల మద్దతు లేదని కమలాహాసన్ చేసిన కామెంట్స్ గురించి ప్రస్తావించడంతో ఉదయనిధి పైవిధంగా స్పందించారు.