Lok Sabha | న్యూఢిల్లీ : లోక్సభలో భద్రతా ఉల్లంఘన ఘటనపై విపక్షాల ఆందోళనతో గురువారం పార్లమెంట్ ఉభయసభలు దద్దరిల్లిన సంగతి తెలిసిందే. లోక్సభలో నిన్న జరిగిన స్మోక్ అటాక్ ఘటనపై ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా వివరణ ఇవ్వాలంటూ విపక్షాలకు చెందిన ఎంపీలు పట్టుబట్టారు.
ఈ క్రమంలో సభా కార్యకలాపాలను అడ్డుకుంటున్నారన్న కారణంతో 14 మంది విపక్ష ఎంపీలను లోక్సభ నుంచి సస్పెండ్ చేశారు. అయితే డీఎంకే ఎంపీ ఎస్ఆర్ పార్థిబన్ సభకు హాజరు కానప్పటికీ అతని పేరును సస్పెండ్ ఎంపీల జాబితాలో చేర్చారు. ఈ విషయాన్ని డీఎంకే పార్టీ నాయకులు ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లారు. ఎంపీ పార్థిబన్ ప్రస్తుతం చెన్నైలో ఉన్నారని, సభకు హాజరు కాలేదని చెప్పారు. దీంతో ప్రభుత్వం వివరణ ఇచ్చింది.
పొరపాటున డీఎంకే ఎంపీ పార్థిబన్ పేరు ఆ జాబితాలో చేర్చామని తెలిపింది. లోక్సభ నుంచి 13 మందిని మాత్రమే సస్పెండ్ చేసినట్లు పార్లమెంట్ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి స్పష్టం చేశారు. ఈ విషయాన్ని స్పీకర్ దృష్టికి తీసుకెళ్లి పార్థిబన్ పేరును ఆ జాబితా నుంచి తొలగించినట్లు పేర్కొన్నారు. 13 మంది ఎంపీల్లో కాంగ్రెస్ నుంచి 9 మంది, సీపీఎం నుంచి ఇద్దరు, డీఎంకే, సీపీఐ నుంచి ఒకరి చొప్పున ఉన్నారు.