DMK MP Raja | చెన్నై/న్యూఢిల్లీ, మార్చి 5: తమిళనాడుకు చెందిన అధికార డీఎంకే పార్టీ సీనియర్ నేత, ఎంపీ ఏ రాజా తీవ్ర వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. భారతదేశం ఎన్నడూ ఒక దేశం కాదని, అది ఒక ఉపఖండం అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపాయి. మరోవైపు జై శ్రీరామ్, భారతమాత అనే బీజేపీ సిద్ధాంతాలను తమిళనాడు ఎన్నటికీ అంగీకరించబోదని పేర్కొన్నారు. రాజా వ్యాఖ్యలపై బీజేపీ తీవ్రంగా స్పందించింది. రాజాను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేసింది. డీఎంకే నేతలు వరుసగా విద్వేష వ్యాఖ్యలు చేస్తున్నారని, భారత్ గుర్తింపును కించపరచడం, భారత విశ్వాసాలను, హిందూ దేవతలను బహిరంగంగా అవమానించడం వారి అజెండాగా మారిందని మండిపడింది. మరోవైపు రాజా వ్యాఖ్యలతో ఏకీభవించడం లేదని, ఎవరైనా మాట్లాడేటప్పుడు సంయమనం పాటించాల్సిన అవసరం ఉన్నదని కాంగ్రెస్ పేర్కొన్నది.
మధురైలో మంగళవారం జరిగిన ఓ సమావేశంలో రాజా మాట్లాడిన వీడియో వైరల్గా మారింది. భారత్ ఎన్నడూ ఒక దేశంగా లేదని, వివిధ ఆచారాలు, సంస్కృతులతో కూడిన ఒక ఉపఖండమని అన్నారు. ‘ఒక దేశం అంటే ఒక భాష, ఒక సంప్రదాయం, ఒక సంస్కృతి ఉంటుంది. అలాంటి లక్షణాలు ఉంటేనే ఏదైనా ఒక దేశం అవుతుంది’ అని వ్యాఖ్యానించారు. ‘భారత్ ఒక ఉపఖండం. ఎందుకంటే తమిళం అనేది ఒక జాతి, ఒక దేశం. అదేవిధంగా మలయాళం అనేది ఒక భాష, ఒక జాతి, ఒక దేశం. ఒరియా కూడా ఒక జాతి, ఒక భాష, ఒక దేశం. ఇలాంటి జాతీయ జాతులన్నీ కలిసి భారత్ను ఏర్పాటు చేశాయి. కాబట్టి భారత్ ఒక దేశం కాదు, ఉపఖండం’ అని రాజా పేర్కొన్నారు. తమిళనాడు, కేరళ, ఢిల్లీ, ఒడిశా వంటి రాష్ర్టాలు స్థానిక సంస్కృతులను కలిగి ఉంటాయని అన్నారు. ‘మణిపూర్లో కుక్క మాంసం తినడం ఒక స్థానిక సాంస్కృతిక అంశం. కశ్మీర్లో కూడా ఒక సంస్కృతి ఉంటుంది. ప్రతి ఒక్క సంస్కృతిని గుర్తించాలి. ఒక కమ్యూనిటీ బీఫ్ తింటే, దాన్ని కూడా గుర్తించాలి. అందులో మీ సమస్య ఏంటి? మిమ్మల్ని తినమని అడిగారా? కావున అది వైవిధ్యతలో ఐక్యత. మనలో ఉన్న భిన్నత్వాలను గుర్తించాల్సిన అవసరం ఉన్నది’ అని రాజా పేర్కొన్నారు.
లోక్సభ ఎన్నికల తర్వాత తమిళనాడులో డీఎంకే ఉండదని ప్రధాని మోదీ చెబుతున్నారని, అలాంటప్పుడు భారతదేశం కూడా ఉండదని రాజా వ్యాఖ్యానించారు. తాను ఇలా ఎందుకు చెబుతున్నానంటే ‘వారు(బీజేపీ) రాజ్యాంగాన్ని నిర్వీర్యం చేయాలని చూస్తున్నారు. మీరు మళ్లీ అధికారంలోకి వస్తే రాజ్యాంగం ఉండదు. దేశంలో రాజ్యాంగం లేకుంటే భారతదేశం కూడా ఉండదు. భారతదేశం లేకుంటే, తమిళనాడు రాష్ట్రం తమిళనాడుగా ఉండదు. మేం విడిపోతాం. భారతదేశానికి ఇది కావాలా?’ అంటూ రాజా మాట్లాడారు.
డీఎంకే నేత రాజా వ్యాఖ్యలపై బీజేపీ నేత, మాజీ కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ తీవ్రంగా స్పందించారు. ఇది మావోయిస్టు సిద్ధాంతమని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజా వ్యాఖ్యలు సరైనవేనని భావిస్తున్నారా? అని ఆ పార్టీ మిత్రపక్ష కాంగ్రెస్ నేతలు సోనియా, రాహుల్, ఖర్గేలను ప్రశ్నించారు. సనాతన ధర్మాన్ని నిర్మూలించాలని గతంలో డీఎంకే మంత్రి ఉదయనిధి స్టాలిన్ వ్యాఖ్యానించారని, ఇప్పుడు రాజా తన వ్యాఖ్యల ద్వారా దేశ విభజనకు పిలుపునిస్తున్నారని బీజేపీ ఐటీ వింగ్ ఇన్చార్జి అమిత్ మాలవీయ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజా వ్యాఖ్యలపై కాంగ్రెస్ సహా ఇండియా కూటమి నేతలు ఎందుకు మౌనం పాటిస్తున్నారని ప్రశ్నించారు. రాజాను అరెస్టు చేయాలని తమిళనాడు బీజేపీ అధికార ప్రతినిధి నారాయణ్ సీఎం స్టాలిన్ను డిమాండ్ చేశారు. రాజా వ్యాఖ్యలపై కాంగ్రెస్ అధికార ప్రతినిధి సుప్రియా శ్రీనేత్ స్పందిస్తూ రాజా వ్యాఖ్యలను 100 శాతం అంగీకరించబోమని, ఖండిస్తున్నామని పేర్కొన్నారు. రాముడు అందరి వాడని, కులమతాలు, ప్రాంతాలకు అతీతుడని మీడియాతో మాట్లాడుతూ అన్నారు.
రాజా తన ప్రసంగంలో రాముడు, భారతమాత గురించి కూడా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ‘వారు(బీజేపీ) చెబుతున్నట్టుగా.. మీరు ఇది దేవుడని, ఇది జై శ్రీరామ్ అని, ఇది భారత్మాతాకీ జై అని చెబితే, మేము కానీ, తమిళనాడు గానీ భారతమాత, జైశ్రీరామ్ను ఆమోదించబోం’ అని అన్నారు. ‘రాముడికి శత్రువు ఎవరు? సీతతో కలిసి రాముడు అడవులకు వెళ్లాడని మా తమిళ్ టీచర్ చెప్పారు. అతను వేటగాడిని అంగీకరించాడు. సుగ్రీవుడు, విభీషణుడులను సోదరులుగా అంగీకరించాడు. అక్కడ కులం, మతం లేదు. నాకు రామాయణం లేదా రాముడు తెలియదు. నేను దానిని నమ్మను’ అని రాజా పేర్కొన్నారు.