కన్యాకుమారి: తమిళనాడులోని కన్యాకుమారిలో ఇవాళ ప్రధాని మోదీ(PM Modi) బహిరంగ సభలో ప్రసంగించారు. తమిళనాడు భవిష్యత్తుకు, సంస్కృతికి డీఎంకే శత్రువు అని, అయోధ్య ప్రాణ ప్రతిష్ట ఈవెంట్ ప్రసారాన్ని బ్యాన్ చేశారని ప్రధాని మోదీ ఆరోపించారు. ఈదేశాన్ని, సంస్కృతిని, వారసత్వాన్ని డీఎంకే ద్వేషిస్తోందని ప్రధాని అన్నారు. ఈ దేశాన్ని విభజించాలని చూసిన వారిని జమ్మూకశ్మీర్ ప్రజలు తిరస్కరించారని, తమిళనాడు ప్రజలు కూడా ఇదే తరహా తీర్పు ఇస్తారని భావిస్తున్నట్లు చెప్పారు. ప్రజలను లూటీ చేసేందుకు డీఎంకే, కాంగ్రెస్ అధికారరంలోకి రావాలని చూస్తున్నారని ఆరోపించారు. 2జీ స్కాంలో డీఎంకేనే అతిపెద్ద లబ్ధిదారు అని మోదీ విమర్శించారు.
మహిళలను అవమానించడం,చీటింగ్ చేయడం డీఎంకే, కాంగ్రెస్కు అలవాటైందని, మాజీ సీఎం జయలలితతో డీఎంకే వర్కర్లు ఎలా ప్రవర్తించారో తమిళనాడు ప్రజలకు తెలుసు అన్నారు. బీజేపీ వైపు అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నాయని, కానీ ఇండియా కూటమి వైపు స్కామ్లు ఉన్నాయన్నారు. ఇండియా కూటమి చేసిన వివిధ స్కామ్లను ప్రధాని మోదీ బయటపెట్టారు. ఆ జాబితా పెద్దగా ఉందన్నారు. కన్యాకుమారి జిల్లా అభివృద్ధి కోసం కేంద్రం అనేక కార్యక్రమాలు చేపడుతోందన్నారు.