బెంగళూర్ : ప్రభుత్వ పాఠశాలల విద్యార్ధులకు ఉచిత షూలు, సాక్స్ల పంపిణీ వ్యవహారంపై కాంగ్రెస్, కాషాయ పార్టీ మధ్య డైలాగ్ వార్ ముదిరింది. ఈ పధకానికి ప్రభుత్వం వద్ద నిధులు లేకుంటే వారి కోసం తాను భిక్షాటన చేసి విద్యార్ధులందరికీ ఉచిత షూలు, సాక్స్ అందిస్తానని కర్నాటక కాంగ్రెస్ చీఫ్ డీకే శివకుమార్ అన్నారు. విద్యార్ధులను ఆదుకునేందుకు ఎన్నో సంస్ధలున్నాయని, కాంగ్రెస్లోనూ తాము రెండు శాతం నిధులను కార్పొరేట్ సామాజిక బాధ్యత కింద సేకరిస్తామని వీటిని సమీకరించి చిన్నారుల కోసం వెచ్చిస్తామని అన్నారు.
పిల్లలు విద్యాబుద్ధుల కోసం పాఠశాలలకు వెళతారని, షూలు, సాక్స్ల కోసం కాదని కర్నాటక విద్యాశాఖ మంత్రి బీసీ నాగేషే చేసిన వ్యాఖ్యల నేపధ్యంలో డీకే శివకుమార్ స్పందించారు. మరోవైపు విద్యా మంత్రి వ్యాఖ్యలపై పెను దుమారం రేగింది. మంత్రి వ్యాఖ్యలు అమానవీయంగా ఉన్నాయని సిద్ధరామయ్య వరుస ట్వీట్లలో ఆక్షేపించారు. చెప్పులు లేకుండా స్కూలుకు వచ్చే పిల్లలు పడే కష్టం గురించి తెలిస్తే ఆయన అలా మాట్లాడరని అభ్యంతరం వ్యక్తం చేశారు.
దళితులు, బీసీలు, అన్ని కులాల్లో పేద విద్యార్ధులకు అవసరమైన పధకాలను తాము అమలు చేశామని, విద్యార్ధులు ఆత్మగౌరవంతో చదువుకునేలా చేశామని చెప్పుకొచ్చారు. పీకల్లోతు అవినీతిలో కూరుకుపోయిన మీకు ఇవి ఎలా తెలుస్తాయని మంత్రిని ఉద్దేశించి సిద్ధరామయ్య వ్యాఖ్యానించారు. ఈ చిన్నారుల భవితవ్యం దెబ్బతింటే అది బీజేపీ ప్రభుత్వ నిర్వాకమేనని మంత్రి నాగేష్ గుర్తెరగాలని అన్నారు.