COVID-19 : ఒమిక్రాన్ కేసుల పెరుగుదలతో కొవిడ్-19 కేసులు అనూహ్యంగా ఎగబాకుతుంటే కర్నాటక కాంగ్రెస్ చీఫ్ డీకే శివకుమార్ మహమ్మారి వ్యాప్తిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కర్నాటకలో కొవిడ్-19 లేదని, రాష్ట్రంలో విద్యా సంస్ధలు, వాణిజ్య రంగాన్ని నాశనం చేసేందుకు కరోనా కేసుల సంఖ్యను బీజేపీ ప్రభుత్వం పెంచి చూపుతోందని డీకే శివకుమార్ ఆరోపించారు.
తమ రాష్ట్రంలో సహజంగా కొవిడ్-19 కేసుల సంఖ్య పెరగడం లేదని ఇది బీజేపీ కొవిడ్ మాత్రమేనని ఓ వార్తా చానెల్తో మాట్లాడుతూ ఆయన పేర్కొన్నారు. ఇక్కడ అసలు కరోనా లేదు..కేవలం నెంబర్లను తారుమారు చేస్తున్నారు..కాషాయ నేతలు రాష్ట్రంలో యాత్రలు చేస్తున్నారని డీకే మండిపడ్డారు.
కర్నాటకలో ఒమిక్రాన్ కేసులు నామమాత్రంగా ఉన్నాయని, బసవరాజ్ బొమ్మై ప్రభుత్వం బోగస్ నెంబర్లతో ప్రజలను మభ్యపెడుతోందని అన్నారు. కర్నాటకలో కరోనా కేసులు ఆందోళనకరంగా పెరుగుతున్నాయని కేంద్రం బుధవారం పేర్కొన్న నేపధ్యంలో డీకే శివకుమార్ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ఇక కర్నాటకలో ఇప్పటివరకూ 226 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి.