బెంగళూర్ : సమస్యల నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకే కర్నాటకలో బీజేపీ ప్రభుత్వం హలాల్, హిజాబ్ అంశాలను ముందుకు తెచ్చిందని రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ డీకే శివకుమార్ అన్నారు. రాజకీయంగా రాష్ట్ర ప్రజలను సమాధానపరచడంలో కాషాయ సర్కార్ విఫలమైందని ఆరోపించారు. స్దానిక ఎన్నికల్లో కాంగ్రెస్ పైచేయి సాధించడంతో హలాల్, హిజాబ్ సమస్యలను బీజేపీ లేవనెత్తుతోందని ఆయన దుయ్యబట్టారు.
రాష్ట్రంలో రైతులు, వ్యాపారులను కూడా బీజేపీ ప్రభుత్వం దెబ్బతీసిందని, పెట్టుబడులు రావడం లేదని, ముస్లింలను బీజేపీ సర్కార్ వేధిస్తోందని శివకుమార్ మండిపడ్డారు. కర్నాటక అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాషాయ పార్టీ ఆయా అంశాలను ముందుకు తెస్తోందని వ్యాఖ్యానించారు. కర్నాటక హోంమంత్రి మతాల మధ్య చిచ్చు పెట్టేలా వ్యాఖ్యలు చేస్తున్నారని కర్నాటక యూత్ కాంగ్రెస్ చీఫ్ మహ్మద్ నల్పాడ్ ఆందోళన వ్యక్తం చేశారు.
కాగా బెంగళూర్లో బుధవారం జరిగిన యువకుడి హత్య విషయంలో హోంమంత్రి అరగ జ్ఞానేంద్ర వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఉర్దూ రాదని చెప్పినందుకే అతడిని హత్య చేశారని ప్రకటించిన హోంమంత్రి ఆపై తన వ్యాఖ్యలను వెనక్కితీసుకున్నారు. రోడ్డు ప్రమాదంపై జరిగిన వాగ్వాదం తీవ్రమై యువకుడి హత్యకు దారితీసిందని ఆపై ఆయన వ్యాఖ్యానించారు. హోంమంత్రి వ్యాఖ్యలపై పెనుదుమారం రేగడంతో ఆయన తన వ్యాఖ్యలను వెనక్కితీసుకున్నారు.