తిరుమల: తిరుమల శ్రీవారి ఆలయంలో ఈ ఉదయం దీపావళి ఆస్థానం శాస్త్రోక్తంగా జరిగింది. ఆలయ అర్చకులు, తిరుమల జీయంగార్లు, టీటీడీ ఉన్నతాధికారుల సమక్షంలో ఆగమోక్తంగా ఆస్థాన వేడుకను బంగారు వాకిలి చెంత నిర్వహించారు. ఈ సందర్భంగా ఈవో మీడియాతో మాట్లాడుతూ.. దీపావళి పండుగ సందర్భంగా ‘దీపావళి ఆస్థానాన్ని’ శాస్త్రోక్తంగా నిర్వహించిట్లు తెలిపారు. బంగారు వాకిలి ముందు గల ఘంటా మండపంలో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారు, శ్రీ విష్వక్సేనుల వారి ఉత్సవమూర్తులను గరుడాళ్వారు సన్నిధిలో అభిముఖంగా ఉంచి ఆస్థానం నిర్వహించినట్లు వివరించారు.
శ్రీవారి ఆశీస్సులతో కరోనా అంతమై, ఈ దీపావళి ప్రజలందరి జీవితాల్లో వెలుగులు నింపాలని, అందరూ ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ఉండాలని ఈవో ఆకాంక్షించారు. అంతకుముందు ఆలయంలో ఉత్సవమూర్తులకు నూతన పట్టువస్త్రాలను సమర్పించి, ధరింపజేసి రూపాయి హారతి, ప్రత్యేక హారతులను నివేదించారు. సాయంత్రం స్వామి, అమ్మవార్ల సహస్ర దీపాలంకరణ సేవలో పాల్గొని, ఆలయ నాలుగు మాడ వీధులలో ఊరేగిస్తారు. ఈ ఆస్థానంలో శ్రీశ్రీశ్రీ పెద్ద జీయర్ స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్నజీర్ స్వామి, ఈవో డాక్టర్ కేఎస్ జవహర్ రెడ్డి, సీవీఎస్వో గోపీనాథ్ జెట్టి, వీజీవో బాలిరెడ్డి, ఆలయ డెప్యూటీ ఈవో రమేష్బాబు, పేష్కార్ శ్రీహరి, ఇతర అధికారులు పాల్గొన్నారు.