విడాకులు తీసుకున్న ముస్లిం మహిళ
విషయంలో అలహాబాద్ హైకోర్టు తీర్పు
లక్నో, ఏప్రిల్ 18: విడాకులు పొందిన ముస్లిం మహిళ ‘ఇద్దత్’ గడువు ముగిసి, మళ్లీ పెండ్లి చేసుకోనంత వరకు సీఆర్పీసీ ప్రకారం భర్త నుంచి భరణం పొందేందుకు అర్హురాలని అలహాబాద్ హైకోర్టు లక్నో బెంచ్ పేర్కొన్నది. ఇస్లామిక్ చట్టం ప్రకారం, విడాకులు తీసుకొన్న ముస్లిం మహిళ మళ్లీ పెండ్లి చేసుకోవడానికి ముందు ఇద్దత్ కాలాన్ని(మూడు నెలలు) పాటించాలి.
సీఆర్పీసీ 125 సెక్షన్లో నిబంధనలు ప్రయోజనకరమైనవని, కాబట్టి దీని ప్రయోజనం విడాకులు తీసుకున్న ముస్లిం మహిళకు కూడా చేరాలని జస్టిస్ కేఎస్ పవార్ నేతృత్వంలోని ధర్మాసనం అభిప్రాయపడింది. ఈ మేరకు ఓ ముస్లిం మహిళ దాఖలు చేసుకున్న రివిజన్ పిటిషన్ను అనుమతించింది. భరణం కోసం ట్రయల్ కోర్టులో ఆమె దరఖాస్తు చేసుకున్న నాటి నుంచి భరణం చెల్లించాలని హైకోర్టు ఆదేశాలు జారీచేసింది.