న్యూఢిల్లీ: ఎలక్టోరల్ బాండ్లపై దాఖలైన పిటిషన్లను సుప్రీం కోర్టు 3 సెట్లుగా విభజించి, వేర్వేరుగా విచారించనున్నది. సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ పీఎస్ నరసింహతో కూడిన ధర్మాసనం ఈ మేరకు నిర్ణయం తీసుకొన్నది. వీటిలో ఎలక్టోరల్ బాండ్ల స్కీమ్ను సవాల్ చేసేవి ఒకటిగా మార్చి మూడో వారంలో సుప్రీం కోర్టు విచారించనున్నది. సమాచార హక్కు చట్టం పరిధిలోకి రాజకీయ పార్టీలను తీసుకురావటంపై వేసిన పిటిషన్లు ఏప్రిల్ మొదటి వారంలో, విదేశీ విరాళాల నియంత్రణ చట్టానికి చేసిన సవరణను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లు ఏప్రిల్ మధ్యలో విచారణకు రానున్నాయి. ఈ పిటిషన్లపై కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేసింది. అయితే, అందులో పేర్కొనని అంశాలు ఉంటే సప్లిమెంటరీ కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేసేందుకు కేంద్రానికి ఫిబ్రవరి చివరి వరకు సుప్రీం అవకాశం ఇచ్చింది.