Booster Dose | చైనాతోపాటు ప్రపంచంలోని పలు దేశాల్లో మహమ్మారి మరోసారి విజృంభిస్తున్నది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ఎప్పటికప్పటిడు వైరస్ కట్టడికి మార్గదర్శకాలు జారీ చేస్తున్నది. కేసులు పెరిగితే తీసుకోవాల్సిన చర్యలపై ఆరోగ్య మంత్రిత్వ శాఖ అధికారులతో ఉన్నతస్థాయి సమావేశం నిర్వహిస్తున్నది. సమావేశాలు నిర్వహిస్తూ కొవిడ్ టెస్టులు, క్వారంటైన్ సదుపాయాలు, వ్యాక్సిన్ మొదలుకొని ఆసుపత్రుల్లో చేయాల్సిన ఏర్పాట్లపై సూచనలు చేస్తున్నారు.
ఆయా భేటీల్లో ప్రముఖంగా సెకండ్ బూస్టర్ డోస్పై చర్చ జరుగుతున్నది. అయితే, ఇప్పటికే ఫస్ట్ బూస్టర్ డోస్ను అర్హత కలిగిన జనాభాలో కేవలం 28శాతం మంది మాత్రమే తీసుకున్నారు. గతేడాది జనవరిలో బూస్టర్ డోస్ను ప్రారంభించారు. మొదట వృద్ధులు, ఫ్రంట్లైన్ ఉద్యోగులు ఇవ్వనున్నట్లు ప్రకటించగా.. తర్వాత అందరికీ అందుబాటులోకి వచ్చింది. ఇదిలా ఉండగా.. ప్రపంచవ్యాప్తంగా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో రెండో బూస్టర్ డోస్పై చర్చలు జరుగుతున్నాయని, నేషనల్ టెక్నికల్ అడ్వైజరీ గ్రూప్ ఆన్ ఇమ్యునైజేషన్ (NTAGI)కు చెందిన ఓ నిపుణుడు తెలిపారు.
ఏదైనా సిఫారసులు చేసే ముందు శాస్త్రీయ డేటాను పరిశీలించనున్నట్లు తెలిపారు. అయితే, టీకా తీసుకున్న తర్వాత రోగనిరోధకశక్తి నాలుగు నుంచి ఆరు నెల్లలో తగ్గుతుందని పలు అధ్యయనాలు పేర్కొన్నాయి. ఈ క్రమంలో నాలుగో టీకా వైరస్ తీవ్రను నివారించేందుకు ఉపయోగపడుతుందని నిపుణులు చెబుతున్నారు. ఇటీవల కొవిడ్పై ఆరోగ్యశాఖతో జరిగిన ఉన్నతస్థాయి సమావేశంలో వైద్యులు డబుల్ బూస్టర్ డోస్ వేయాలని కేంద్రానికి సూచించారు.
వృద్ధులు, ఆరోగ్య సంరక్షణ కార్యకర్తలు, కొమొర్బిడిటీలున్న వ్యక్తులకు నాలుగో టీకా వేసేందుకు అనుమతి ఇవ్వాలని డిసెంబరు 26న జరిగిన సమావేశంలో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ప్రతినిధులు కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవియాను కోరారు. ఆరోగ్య సంరక్షణ, ఫ్రంట్లైన్ వర్కర్స్కు ప్రికాషరీ డోస్ను ఏడాది కింది ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ పరిస్థితుల్లో ప్రపంచవ్యాప్తంగా కొవిడ్ మహమ్మారి ఆందోళన మధ్య డబుల్ బూస్టర్ డోస్ వేయాలని, తద్వారా వైరస్ను కట్టడి చేయవచ్చని నిపుణులు పేర్కొంటున్నారు.