(స్పెషల్ టాస్క్ బ్యూరో)హైదరాబాద్, డిసెంబర్ 29 (నమస్తే తెలంగాణ): ఆరుగాలం శ్రమించి ఎవుసం చేసే రైతన్నకు సాయం చేద్దామనుకొన్న తెలంగాణ సర్కారుపై కస్సుమన్న కేంద్రంలోని మోదీ ప్రభుత్వం.. ఉపాధి హామీ కూలీలు పడిన కష్టానికి తగ్గ ప్రతిఫలాన్ని ఇవ్వడంలోనూ తాత్సారం చేస్తున్నది. ముఖ్యంగా ప్రతిపక్ష పార్టీలు అధికారంలో ఉన్న రాష్ర్టాలపై సవతి తల్లి ప్రేమను చూపిస్తున్నది. మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి గ్రామీణ హామీ పథకం (ఎంఎన్ఆర్ఈజీఏ) కింద విడుదల చేయాల్సిన బకాయిలను ఏండ్లకేండ్లూ పొడిగిస్తూ వస్తున్నది.
ప్రతిపక్ష పార్టీలు అధికారంలో ఉన్న రాష్ర్టాలకు దాదాపు రూ.4 వేల కోట్లు బకాయి పడటం దీనికి నిదర్శనం. ఉపాధి గ్రామీణ హామీ పథకం బకాయిలు ఎక్కువగా ఉన్న రాష్ర్టాల జాబితాలో ఏడు రాష్ర్టాలు ప్రతిపక్ష పార్టీలు అధికారంలో ఉన్న రాష్ర్టాలే. ఇదే సమయంలో గుజరాత్, మహారాష్ట్ర వంటి బీజేపీపాలిత రాష్ర్టాలకు కేంద్రం ఎప్పటికప్పుడు నిధులను విడుదల చేస్తుండటం గమనార్హం. మోదీ సర్కారు పక్షపాత వైఖరితో చేసిన పనికి పైసలు అందక వేల మంది మంది కూలీలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
తెలంగాణపై కేంద్రం అక్కసు
ఉపాధి హామీ పథకం అమలులో తెలంగాణ రాష్ట్ర రైతాంగాన్ని కేంద్రంలోని బీజేపీ సర్కారు అడుగడుగునా మోసం చేస్తూ వస్తున్నది. వడ్లు ఎండబోసేందుకు పల్లెల్లో కావాలసినంత స్థలం లేకపోవడంతో రైతన్నలు ధాన్యాన్ని రోడ్లపై ఆరబోస్తున్నారు. దీంతో పెద్దయెత్తున రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇది గమనించిన తెలంగాణ ప్రభుత్వం ఉపాధిహామీ పథకం కింద సిమెంటు కల్లాల్ని నిర్మించుకొనేందుకు అన్నదాతలకు అవకాశం ఇచ్చింది. ఈ నిర్ణయాన్ని తప్పుబట్టిన బీజేపీ ప్రభుత్వం.. గత రెండేండ్లుగా రాష్ట్రంలో కల్లాల నిర్మాణానికి అయిన సొమ్ము 151 కోట్ల రూపాయలు తిరిగి చెల్లించాలని ఇటీవల హుకుం జారీ చేసింది.
ఎండు చేపల కల్లాలకు మాత్రం అనుమతి
సముద్ర తీర ప్రాంత రాష్ర్టాల్లో ఎండు చేపల కల్లాలు (ఫిష్ డ్రైయింగ్ యార్డ్స్) ఏర్పాటు చేసుకోవడానికి ఉపాధి హామీ పథకాన్ని వర్తింపజేసిన కేంద్రం.. వరి ధాన్యాన్ని ఎండబెట్టే కల్లాలకు మాత్రం ఈ పథకాన్ని ఎందుకు వర్తింప చేయడం లేదని అన్నదాతలు ప్రశ్నిస్తున్నారు. రూ.151 కోట్లు తిరిగి ఇవ్వడం కాదు.. న్యాయంగా తెలంగాణకు రావాల్సిన రూ.139.77 కోట్ల ఎంఎన్ఆర్ఈజీఏ బకాయిలను వెంటనే విడుదల చేయాలని కేంద్రాన్ని డిమాండ్ చేస్తున్నారు.