ముంబై: మహారాష్ట్రలో అక్రమంగా తరలిస్తున్న వివిధ రకాల జీవులను అధికారులు సీజ్ చేశారు. జీవులను అక్రమంగా తరలిస్తున్నట్లు సమాచారం అందుకున్న డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (DRI) అధికారులు వెంటనే రైడ్ చేసి వాటిని స్వాధీనం చేసుకున్నారు. DRI కి చెందిన ముంబై యూనిట్ అధికారులు వీటిని పట్టుకున్నారు.
అధికారులు స్వాధీనం చేసుకున్న జీవుల్లో చాలావరకు విదేశీ జాతులవి కూడా ఉన్నాయి. ముంబై ఎయిర్పోర్టులోని ఎయిర్ కార్గో కాంప్లెక్స్లోగల ఇంపోర్ట్ కన్సైన్మెంట్ నుంచి వీటిని స్వాధీనం చేసుకున్నారు. ఆ ప్యాకింగ్లో కొండచిలువలు, తాబేళ్లు, బల్లులు సహా మొత్తం 665 జీవులు ఉన్నాయి. కొన్ని అత్యంత అరుదుగా కనిపించే విలక్షణ జాతుల జీవులు కూడా పట్టుబడ్డాయి.
నిందితులు చేపలను తరలించే పెట్టెల్లో ఈ జీవులను దాచి అక్రమంగా ముంబైకి తరలించినట్లు అధికారులు చెప్పారు. జీవులను సీజ్ చేసిన అధికారులు.. వాటిని బయటి నుంచి ముంబైకి తీసుకొచ్చిన వ్యక్తిని, ముంబైలో డెలివరీ తీసుకోబోయే వ్యక్తిని కూడా అదుపులోకి తీసుకున్నారు. కేసులో తదుపరి విచారణ కొనసాగుతుందని చెప్పారు.