న్యూఢిల్లీ: వచ్చే నెలలో జరుగనున్న పంజాబ్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, గోవా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి సన్నద్దమవుతున్న ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) వినూత్నంగా ఎన్నికల ప్రచారానికి తెర తీసింది. దేశ రాజధానిలో అధికారంలో ఉన్న ఆ పార్టీ, ఢిల్లీ వాసులకు బంపర్ ఆఫర్ ఇచ్చింది. తమ ప్రభుత్వం చేసిన “మంచి పని” గురించి సోషల్ మీడియాలో ప్రచారం చేయాలని దేశ రాజధాని ప్రజలకు సీఎం అరవింద్ కేజ్రీవాల్ విజ్ఞప్తి చేశారు. వీడియోలు బాగా వైరల్ అయిన యాభై మంది ఢిల్లీ వాసులను ఎన్నికల తర్వాత విందుకు ఆహ్వానిస్తానని ఆయన తెలిపారు.
వచ్చే నెలలో జరుగనున్న ఐదు రాష్ట్రల అసెంబ్లీ ఎన్నికల కోసం “ఏక్ మౌకా కేజ్రీవాల్ కో” (కేజ్రీవాల్కి అవకాశం ఇవ్వండి) అనే నినాదంతో డిజిటల్ ప్రచారాన్ని అరవింద్ కేజ్రీవాల్ సోమవారం ప్రారంభించారు. “ఢిల్లీ ప్రభుత్వం చేస్తున్న మంచి పనులపై వీడియోలను అప్లోడ్ చేయండి. వాటి నుంచి ఎలా ప్రయోజనం పొందారో అన్నది మీ ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ ద్వారా ప్రజలకు చెప్పండి . అలాగే ఈ రాష్ట్రాల్లో మీకు తెలిసిన వ్యక్తులను కేజ్రీవాల్కు అవకాశం ఇవ్వాలని విజ్ఞప్తి చేయండి” అని కోరారు.
ఢిల్లీలో ఉచిత కరెంటు, నీరు అందించడం వంటి ఎన్నో మంచి పనులు తమ ప్రభుత్వం చేసిందని కేజ్రీవాల్ తెలిపారు. “ఢిల్లీలో నడుస్తున్న మొహల్లా క్లినిక్లను చూడటానికి ఐక్యరాజ్యసమితి నుండి వచ్చారు. అమెరికా అధ్యక్షుడి భార్య ఇక్కడ పాఠశాలలను సందర్శించారు. ఢిల్లీకి ఇప్పుడు 24 గంటల కరెంటు వస్తోంది. ఢిల్లీ ప్రజలు మాకు అవకాశం ఇవ్వడం వల్లే ఇదంతా సాధ్యమైంది” అని వెల్లడించారు.
ఢిల్లీ ప్రభుత్వం చేస్తున్న మంచి పనులపై వీడియోలను షేర్ చేసి వాటిని వివిధ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లలో వైరల్ చేయాలని తన పార్టీ కార్యకర్తలకు కూడా కేజ్రీవాల్ విజ్ఞప్తి చేశారు. వీడియోలు వైరల్ అయ్యిన 50 మంది ఢిల్లీ వాసులతో కలిసి ఎన్నికల తర్వాత డిన్నర్ చేస్తానని తెలిపారు.