భోపాల్ : ఆరెస్సెస్కు చెందిన సరస్వతీ శిశు మందిర్ స్కూళ్లలో చిన్నారుల మనస్సుల్లో మత విద్వేషాన్ని రాజేస్తున్నారని కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ చేసిన వ్యాఖ్యలపై జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ (ఎన్సీపీసీఆర్) ఆయనకు నోటీసులు జారీ చేసింది. ఈ వ్యవహారంపై విచారణ చేపట్టి వారం రోజుల్లోగా నివేదిక సమర్పించాలని మధ్యప్రదేశ్ డీజీపీని కోరింది.
మీరు చేసిన వ్యాఖ్యలతో సరస్వతి శిశు మందిర్ స్కూళ్లలో చదివే విద్యార్ధులందరి వ్యక్తిత్వం, గౌరవం దెబ్బతిందని, జువెనిల్ జస్టిస్ చట్టం నియమాలకూ ఇవి విరుద్ధంగా ఉన్నాయని దిగ్విజయ్ సింగ్కు ఇచ్చిన నోటీసుల్లో ఎన్సీపీసీఆర్ పేర్కొంది. మీరు చేసిన వ్యాఖ్యలకు సంబంధించి ఎలాంటి సమాచారం ఉన్నా ఈ లేఖ అందిన మూడు రోజుల్లోగా కమిషన్కు అందచేయాలని ఎన్సీపీసీఆర్ చీఫ్ ప్రియాంక్ కనుంగో కోరారు. కాగా ఆరెస్సెస్కు చెందిన స్కూళ్లలో ఇతర మతాల పట్ల విద్వేషం నూరిపోస్తున్నారని భోపాల్లో శనివారం జరిగిన ఓ కార్యక్రమంలో దిగ్విజయ్ సింగ్ ఆరోపించారు.