న్యూఢిల్లీ : 2019 పుల్వామా ఉగ్రదాడిపై లేదా 2016లో పాకిస్తాన్పై చేపట్టిన సర్జికల్ స్ట్రైక్స్పై కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరకూ పార్లమెంట్లో ఎలాంటి నివేదిక సమర్పించలేదని కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ పేర్కొన్నారు. బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం అసత్యాలను ప్రచారం చేస్తోందని దుయ్యబట్టారు. రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర జమ్ము కశ్మీర్లో అడుగుపెట్టిన క్రమంలో మధ్యప్రదేశ్ మాజీ సీఎం దిగ్విజయ్ సింగ్ మోదీ సర్కార్ లక్ష్యంగా విమర్శలు గుప్పించారు.
పుల్వామాలో 40 మంది మన సీఆర్పీఎఫ్ జవాన్లు మరణించారని, సైనిక సిబ్బందిని ఎయిర్ లిఫ్ట్ చేయాలని ప్రధాని మోదీని సీఆర్పీఎఫ్ అధికారులు కోరినా ఆయన నిరాకరించారని, ఈ వైఫల్యం ఎలా చోటుచేసుకుందని దిగ్విజయ్ సింగ్ ప్రశ్నించారు. పుల్వామాపై ఇప్పటివరకూ పార్లమెంట్ ముందు నివేదికను సమర్పించలేదని దిగ్విజయ్ సింగ్ పేర్కొన్నారు. సర్జికల్ స్ట్రైక్ జరిగిందని చెబుతున్న పాలకులు అందుకు ఆధారాలను మాత్రం చూపడం లేదని మండిపడ్డారు.
కమలనాధులు కేవలం అసత్యాలను మాత్రమే ప్రచారం చేస్తున్నారని చెప్పుకొచ్చారు. ఆర్టికల్ 370 రద్దు అనంతరం కూడా జమ్ము కశ్మీర్లో ఉగ్రవాద కార్యకలాపాలు కొనసాగుతున్నాయని దిగ్విజయ్ సింగ్ పేర్కొన్నారు. రాజౌరీ, జమ్ములో జరిగిన ఉగ్ర దాడులను ఖండిస్తున్నామని అన్నారు. ఆర్టికల్ 370 తర్వాత జమ్ము కశ్మీర్లో ఉగ్రదాడులు తగ్గాయని మోదీ సర్కార్ చేస్తున్న ప్రచారం అవాస్తమని చెప్పారు. బాంబు పేలుళ్లు, ఎంపిక చేసుకున్న లక్ష్యాలపై దాడులు మరోసారి పేట్రేగాయని దిగ్విజయ్ సింగ్ తెలిపారు.