Digvijay Singh | హిందూ, హిందుత్వ పదాల వివాదాన్ని కాంగ్రెస్ కొనసాగిస్తూనే వుంది. కొన్ని రోజుల క్రితం ఈ పదాలను ఆ పార్టీ ఎంపీ రాహుల్ గాంధీ విరివిగా వాడారు. తాజాగా ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్ సింగ్ కూడా ఆ పదాల తేనెతుట్టెను కదిపారు. ఇందుకు స్వాతంత్య్ర సమరయోధుడు వీర సావర్కర్ రాసిన పుస్తకాన్ని ఉదాహరణగా పేర్కొన్నారు. హిందూ మతానికి హిందుత్వతో అసలు ఏమాత్రం సంబంధమే లేదని ఆయన ఓ పుస్తకంలో పేర్కొన్నారని దిగ్విజయ్ ఉటంకించారు. భోపాల్లో జరిగిన పార్టీ శిక్షణా శిబిరంలో ఆయన పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘గోవు మన అమ్మకాదు. గోమాంసం భుజించినా.. ఎలాంటి సమస్యా లేదు అని సావర్కర్ స్పష్టంగా ఆ పుస్తకంలో పేర్కొన్నారు.’ అని దిగ్విజయ్ సింగ్ పేర్కొన్నారు. వచ్చే ఎన్నికల్లో కూడా బీజేపీ విజయం సాధిస్తే, రాజ్యాంగాన్ని కూడా మార్చేస్తుందని, రిజర్వేషన్ వ్యవస్థకు మంగళం పాడుతుందని ఆరోపించారు. ప్రభుత్వాన్ని నడపడానికి చైనా, రష్యా పద్ధతులను అనుసరిస్తున్నారని, రాజ్యాంగాన్ని పూర్తిగా మార్చేస్తారని దిగ్విజయ్ ఆరోపించారు. గోవు విషయంలో కొందరు జోకులు వేసుకుంటున్నారని, అయితే తమకు మాత్రం గోవు అత్యంత పూజనీయమని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. పశు సంపద వల్ల చాలా మంది జీవిస్తున్నారని, ఈ విషయాన్ని వారు మరిచిపోతున్నారని మోదీ మండిపడ్డారు. మోదీ వ్యాఖ్యలకు దిగ్విజయ్ పై విధంగా కౌంటర్ ఇచ్చారు.