న్యూఢిల్లీ: కరోనా సెకండ్ వేవ్ను నియంత్రించడానికి పలు రాష్ట్ర ప్రభుత్వాలు విధించిన లాక్డౌన్లు, ఆంక్షలతో వాహనాల రవాణా స్తంభించింది. ఫలితంగా ఆయా రాష్ట్రాల్లోనూ, మధ్య వాహనాల రాకపోకలు భారీగా తగ్గాయి. కానీ ఆంక్షలను సడలిస్తూ ప్రభుత్వాలు నిర్ణయం తీసుకోవడంతో వాహనాల ట్రాఫిక్ తిరిగి పెరిగింది.
ఫలితంగా జూన్ నెలలో ఫాస్టాగ్ టోల్ వసూళ్లు గత నెలలో 21 శాతం పెరిగి రూ.2,576.28 కోట్లకు చేరాయి. టోల్ లావాదేవీలు పెరిగాయని నేషనల్ హైవే అధారిటీ ఆఫ్ ఇండియా (ఎన్హెచ్ఏఐ) తెలిపింది. అయితే మార్చిలో రూ.3086.32 కోట్లు, ఏప్రిల్లో రూ.2,776.90 కోట్ల వసూళ్లతో పోలిస్తే జూన్ వసూళ్లు తక్కువే.
జూన్ నెలలో ఫాస్టాగ్ టోల్ లావాదేవీలు 15.786 కోట్లకు పెరిగాయి. గత మే నెలలో 11.65 కోట్లుగా ఉన్నాయి. మార్చిలో అత్యధికంగా 19.321 కోట్లు ఏప్రిల్లో 16.433 కోట్ల లావాదేవీలు జరిగాయి. టోల్ వసూళ్లలో ఫాస్టాగ్ కలెక్షన్లు 95 శాతం. ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి 100 శాతం ఈ-టోలింగ్కు ఫాస్టాగ్ను తప్పనిసరి చేస్తూ ఎన్హెచ్ఏఐ ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసింది.
ఆంక్షలు సడలించడంతో ఆర్థిక వ్యవస్థ క్రమంగా గాడిలో పడుతున్నది. గత మే నెలలో ట్రక్కుల రవాణా 65 శాతం, జూన్లో 75 శాతం పెరిగింది. జూన్ నెలలో 16 కోట్ల వాహనాలు టోల్ టాక్స్ చెల్లించాయి.
కరోనా రెండో వేవ్ వల్ల ఏప్రిల్, మే నెలల్లో జాతీయ రహదారులపై వాహనాల ట్రాఫిక్ తగ్గిందని రేటింగ్ ఏజెన్సీ క్రిసిల్ పేర్కొంది. మే నెలలో టోల్ టాక్స్ చెల్లించిన వాహనాల సంఖ్య 12 కోట్లకు చేరుకున్నది.