భిన్న ప్రకటనలు చేసిన ఐఎండీ, స్కైమెట్
నేడు, రేపు రాష్ట్రంలో వర్షాలు పడే అవకాశం
న్యూఢిల్లీ, మే 30: నైరుతి రుతుపవనాలు సోమవారం కేరళ తీరాన్ని తాకుతాయని ఆదివారం ఉదయం భారత వాతావరణ విభాగం (ఐఎండీ) తెలిపింది. అయితే, మధ్యాహ్నం మళ్లీ ఓ ప్రకటన విడుదల చేసిన ఐఎండీ.. రుతుపవనాల రాకలో కాస్త జాప్యం చోటుచేసుకోనుందని, వచ్చే నెల 3న రుతుపవనాలు కేరళకు చేరుకుంటాయని వెల్లడించింది. అయితే ఈ రెండు ప్రకటనలను తోసిపుచ్చుతూ ప్రైవేట్ వాతావరణ అధ్యయన సంస్థ స్కైమెట్ కొత్త ప్రకటన చేసింది. నైరుతి రుతుపవనాలు ఇప్పటికే కేరళలో ప్రవేశించాయని ఆ సంస్థ పేర్కొంది. వాస్తవానికి ఏటా జూన్ 1న నైరుతి రుతుపవనాలు కేరళలోకి ప్రవేశిస్తాయి.
నేడు, రేపు రాష్ట్రంలో వర్షాలు
హైదరాబాద్, మే 30 (నమస్తే తెలంగాణ): ఆదివారం ఏర్పడిన ఉపరితల ద్రోణి, ఉపరితల ఆవర్తనం కారణంగా నైరుతి, మధ్య తెలంగాణ జిల్లాల్లోని ఒకటి రెండు ప్రదేశాల్లో సోమ, మంగళవారాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొన్నది. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాల్లో అక్కడక్కడ వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపింది. గడిచిన 24 గంటల్లో యాదాద్రి భువనగిరి, వికారాబాద్, కామారెడ్డి, నారాయణపేట, నాగర్కర్నూలు, వరంగల్ రూరల్, సంగారెడ్డి, నిర్మల్, మంచిర్యాల, నిజామాబాద్, రంగారెడ్డి, సిద్దిపేట, రాజన్న సిరిసిల్ల, మెదక్ జిల్లాల్లో పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది.