Diabetes| న్యూఢిల్లీ: మధుమేహం బారిన పడేవారి సంఖ్య అంతకంతకూ పెరుగుతున్నది. ప్రపంచవ్యాప్తంగా 2050 నాటికి 130 కోట్ల మందికిపైగా డయాబెటిస్ బారిన పడే ప్రమాదమున్నదని లాన్సెట్ అధ్యయనం హెచ్చరించింది. ఇందులో టైప్-2 డయాబెటిస్ వారి సంఖ్యే ఎక్కువగా ఉండనుందని పేర్కొన్నది. మరిన్ని వ్యాధులకు మధుమేహం దారితీసే ప్రమాదం ఉన్న నేపథ్యంలో తాజా అధ్యయనం ప్రాధాన్యం సంతరించుకున్నది. మధుమేహులకు గుండెజబ్బులు, స్ట్రోక్, ఫుట్ అల్సర్, కంటిచూపు కోల్పోవడం వంటి ఇతర సమస్యలు తలెత్తే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. సరైన అవగాహన, చికిత్స లేకపోవడం వల్ల అనేక మంది ఈ వ్యాధులకు గురవుతున్నారు.
మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్లు, శారీరక శ్రమ లేకపోవడం, వయసు, ఒబెసిటీ తదితర కారణాల వల్ల మధుమేహం బారిన పడుతున్నట్టు తాజా అధ్యయనం వెల్లడించింది. ప్రీడయాబెటిస్ను ముందే గుర్తిస్తే డయాబెటిస్ ముప్పు బారిన పడకుండా చూడొచ్చని తెలిపింది. మితిమీరిన రిఫైన్డ్ కార్బోహైడ్రేట్, ఆహారం, డ్రింక్స్లో షుగర్ ఎక్కువగా తీసుకోవడం, అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్ వంటివి అధికంగా తీసుకోవడం వల్ల మధుమేహ ముప్పును పెరుగుతుందని వైద్యులు వెల్లడించారు.