న్యూఢిల్లీ: మధుమేహ మహమ్మారి వయసు మళ్లినవారినే కాదు యువతనూ కబళిస్తున్నది. దేశంలో యుక్త వయసులోనే డయాబెటిస్ బారిన పడుతున్నవారి సంఖ్య పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తున్నది. 15-34 ఏండ్ల వయసువారిని కూడా చక్కెరవ్యాధి చుట్టుముడుతున్నదని ఇటీవల విడుదల చేసిన జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే-5 నివేదికలో వెల్లడైంది. ఐదు రాష్ర్టాల్లో 35 ఏండ్ల లోపువారిలో డయాబెటిస్ వ్యాధి బారిన పడిన వారి సంఖ్య 8 శాతానికి మించి ఉన్నదని తేలింది. సాధారణంగా ప్రతి వ్యక్తిలో ర్యాండమ్ బ్లడ్ గ్లూకోజ్ స్థాయి 140 ఎంజీ/డీఎల్ కన్నా ఎక్కువ ఉంటే అతడికి మధుమేహ వ్యాధి ఉన్నట్టుగా పరిగణిస్తారు. 140 కన్నా తక్కువ ఉంటే సాధారణ స్థాయిగా గుర్తిస్తారు. 140కి మించి నమోదైన వారు షుగర్ వ్యాధి నిర్ధారణకు ఇతర పరీక్షలు చేయించుకోవాల్సి ఉంటుంది. ఆ పరీక్షల్లో ఆ వ్యాధి వారికి ఎంతకాలం నుంచి ఉంది, ఏ స్థాయిలో ఉందో గుర్తించి డాక్టర్లు చికిత్స చేస్తారు. ఒకసారి ఈ వ్యాధి బారిన పడిన వారు జీవితాంతం వైద్య చికిత్స చేయించుకోవాల్సిందే.
ప్రమాద ఘంటికలు..
ఆంధ్రప్రదేశ్, పశ్చిమబెంగాల్, ఉత్తరాఖండ్, గోవా, త్రిపుర రాష్ర్టాల్లో 2019-21 మధ్య జరిపిన సర్వేలో 35 ఏండ్లలోపు పురుషుల్లో 8 శాతానికి పైగా ర్యాండమ్ బ్లడ్ గ్లూకోజ్ లెవల్స్ 140 ఎంజీ/డీఎల్ దాటి ఉండటాన్ని గుర్తించారు. పశ్చిమబెంగాల్, త్రిపుర రాష్ర్టాల్లో మహిళలు సైతం ఇదే స్థాయిలో ఈ వ్యాధి బారిన పడుతున్నట్టు సర్వేలో వెల్లడైంది. తెలంగాణ, తమిళనాడు, ఈశాన్య రాష్ర్టాలైన అస్సాం, మేఘాలయ, సిక్కిం, మిజోరాంతో పాటు గుజరాత్, ఒడిశాలో 6 శాతం మందికిపైగా డయాబెటిస్ ఉన్నట్టు గుర్తించారు.
అప్రమత్తత అవసరం..
నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే ఫలితాలు దేశంలోని యువత డయాబెటిస్ వ్యాధి పట్ల అప్రమత్తమవ్వాల్సిన అవసరాన్ని తెలియజేస్తున్నది. ఈ వ్యాధి ప్రాణాంతకం కాకపోయినా సరైన చికిత్స, ఆహార నియమాలతో పాటు వ్యాయామం చేస్తే అదుపులో ఉంచుకోవచ్చునని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. వంశపారంపర్యం, కాలుష్యం, మితిమీరిన ఫాస్ట్ ఫుడ్ అలవాట్లు ఈ వ్యాధికి దారితీస్తాయని, వ్యాధి వచ్చిన తర్వాత బాధపడేకంటే ముందు జాగ్రత్తలు తీసుకోవాలని వారు అంటున్నారు. అలాగని వ్యాధిని నిర్లక్ష్యం చేస్తే ప్రమాదకర పరిణామాలకు దారితీస్తుందని హెచ్చరిస్తున్నారు.