కోణార్క్ : ఒడిశాలోని 13వ శతాబ్దపు కోణార్క్ సూర్య దేవాలయ గర్భ గుడిలోకి త్వరలో భక్తులు ప్రవేశించే అవకాశం రానున్నది. ప్రస్తుతం ఆ స్థలం ఇసుకతో నిండి ఉంది. దాన్ని ఇప్పుడు తొలగిస్తున్నారు. ఆలయం వెనుక ఉన్న 15 అడుగుల ఎత్తయిన గోడ కూలిపోకుండా నిరోధించడానికి బ్రిటిష్ పాలకులు 1903-04లో గర్భ గుడిని వేల టన్నుల ఇసుకతో నింపారు.
జగ్మోహన్ హాల్గా పిలిచే ఈ ప్రాంతంలోకి శతాబ్దం పాటు ఎవరూ ప్రవేశించలేదు. తాజాగా భారత పురావస్తు శాఖ, ఐఐటీ మద్రాస్ నిపుణులతో కూడిన బృందం ఈ ఇసుకను తొలగించే పని చేపట్టింది. మొత్తం ఇసుకను తరలించడానికి మూడు నెలలు పడుతుందని ఓ పురావస్తు శాఖ అధికారి తెలిపారు. ఇసుకను తరలించిన తర్వాత లోపలి గోడల పటిష్ఠతను పరిశీలించి గుడి పునర్ నిర్మాణంపై ఓ నిర్ణయం తీసుకోనున్నారు.