Suicide Drone | కాన్పూర్, జూలై 11: భారత సైన్యం అమ్ములపొదిలో చేరేందుకు మరో అత్యాధునిక మానవరహిత వాహనం (యూఏవీ) సిద్ధమైంది. ఐఐటీ కాన్పూర్ స్వదేశీ పరిజ్ఞానంతో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ఆధారిత కామికేజ్ డ్రోన్ (సూసైడ్ డ్రోన్)ను అభివృద్ధి చేసింది. ఇది ఆరు కిలోల బరువుగల పేలోడోను 100 కిలోమీటర్ల వరకు మోసుకెళ్లే సామర్థ్యం కలిగి ఉంటుంది. జీపీఎస్ సపోర్ట్ లేకపోయినా ఈ డ్రోన్లు శత్రులక్ష్యాలను నిర్వీర్యం చేయగలవు.
డ్రోన్ రాడార్ల కన్నుగప్పేలా స్టెల్త్ టెక్నాలజీని అమర్చినట్టు ఐఐటీ కాన్పూర్ ఏరోస్పేస్ డిపార్ట్మెంట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ సుబ్రహ్మణ్యం సద్రాలా తెలిపారు. డీఆర్డీవోకు చెందిన యంగ్ సైంటిస్ట్ ల్యాబొరేటరీ ప్రాజెక్టు కింద ఈ డ్రోన్ను గత ఏడాది నుంచి అభివృద్ధి చేస్తున్నట్టు చెప్పారు. రాబోయే ఆరు నెలల్లో వీటిని పరీక్షించనున్నట్టు తెలిపారు.
ఎన్నో విశేషాలు..
1. కామికేజ్ డ్రోన్ 2 మీటర్ల పొడవు ఉంటుంది.
2. మడత పెట్టేందుకు వీలైన రెక్కలు కలిగి ఉంటుంది.
3. ఇందులో కెమెరాలు, ఇన్ఫ్రారెడ్ సెన్సార్లు అమర్చబడి ఉంటాయి.
4. దీన్ని కాటాపుల్ట్ లేదా కానిస్టర్ లాంఛర్నుంచి ప్రయోగించవచ్చు.
5. జీపీఎస్ లేకున్నా కృత్రిమ మేధ సహాయంతో ఇది శత్రులక్ష్యాన్ని నిర్వీర్యం చేయగలదు.
6. బ్యాటరీతో పనిచేసే ఈ డ్రోన్ 40 నిమిషాల్లో పేలోడ్ను 100 కిలోమీటర్ల వరకు మోసుకెళ్లగలదు.
7. గాల్లో ఎగిరేటప్పుడు స్వయంప్రతిపత్తిగా ఉంటుంది. ఆల్గారిథమ్ ఆధారంగా సొంత నిర్ణయాలు తీసుకుంటుంది.
8. దీన్ని రిమోట్ లొకేషన్స్ నుంచి ఆపరేట్ చేయొచ్చు. ఇందులోని హై రెజల్యూషన్ కెమెరా సహాయంతో శత్రువు స్థావరాల ఫొటోలను తీసి పంపగలదు.
9. అన్ని వాతావరణ పరిస్థితుల్లో రాత్రి, పగలు పనిచేసే సామర్థ్యం కలిగి ఉంటుంది. ఇందులోని స్టెల్త్ టెక్నాలజీ సహాయంతో ఇది రాడార్నుంచి తప్పించుకోగలదు.