ఔరంగాబాద్: ముంబై-సికింద్రాబాద్ మధ్య నడిచే దేవగిరి ఎక్స్ప్రెస్ రైలుకు పెను ప్రమాదం తప్పింది. మహారాష్ట్రలోని జాల్నా జిల్లా మీదుగా వెళ్తున్న క్రమంలో పట్టాలపై ఉన్న ఓ పెద్ద డ్రమ్మును లోకో పైలట్ గుర్తించాడు. దీంతో వెంటనే బ్రేకులు వేసి రైలును ఆపాడు. అనంతరం ఆ డ్రమ్మును పరిశీలించగా దాని నిండా రాళ్లు ఉన్నాయి. విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లడంతో ఘటనాస్థలానికి ఆర్పీఎఫ్ పోలీసులు వచ్చారు. డ్రమ్మును తొలగించి, పట్టాలను పరిశీలించి అంతా సవ్యంగానే ఉన్నదని చెప్పగానే లోకో పైలట్ రైలును ముందుకు పోనిచ్చాడు.