Telangana | న్యూఢిల్లీ, ఆగస్టు 13: ఆర్థిక రంగంలో తెలంగాణ టాప్ లేపింది. తెలంగాణ ఆర్థిక స్థితిపై విమర్శలు చేస్తూ, రాష్ట్రంపై విషం చిమ్మే వారికి సమాధానంగా ఆర్థిక ఆరోగ్య నివేదికలో టాప్-3లో నిలిచి రాష్ట్రం సత్తాచాటింది. డాయిష్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చీఫ్ ఎకనమిస్ట్ కౌశిక్ దాస్ రూపొందించిన నివేదికలో ఈ విషయం బహిర్గతమైంది. ఈ నివేదిక ప్రకారం తెలంగాణ మూడో స్థానంలో నిలిచింది. 2024 ఆర్థిక సంవత్సరం మొదటి బడ్జెట్ అంచనాల ప్రకారం ఈ నివేదికను రూపొందించారు. 17 రాష్ర్టాలున్న ఈ జాబితాలో మహారాష్ట్ర ప్రథమ స్థానం దక్కించుకోగా.. ఛత్తీస్గఢ్ ద్వితీయ స్థానంలో నిలిచింది. మరోవైపు పశ్చిమబెంగాల్, పంజాబ్, కేరళ కింది వరుసలో నిలిచాయి.
2023 ఆర్థిక సంవత్సరం సవరించిన బడ్జెట్ అంచనాల ప్రకారం మహారాష్ట్ర మొదటి స్థానంలో నిలవగా.. ఛత్తీస్గఢ్, ఒడిశా, తెలంగాణ వరుసగా తర్వాతి స్థానాల్లో నిలిచాయి. అదే సమయంలో పశ్చిమబెంగాల్, పంజాబ్, బీహార్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ చివరి వరుసలో నిలిచాయి. క్రితం ఏడాదితో పోలిస్తే గుజరాత్ రెండు స్థానాలు దిగజారి ఏడో స్థానానికి చేరుకున్నది. అదే సమయంలో ఏపీ మూడు స్థానాలు కోల్పోయి 11వ స్థానానికి పడిపోయింది. మరోవైపు 2004-2016 వరకు మహారాష్ట్ర, కర్ణాటక, ఛత్తీస్గఢ్, తమిళనాడు రాష్ర్టాలు క్రమం తప్పకుండా టాప్లో నిలిచాయి. అదే సమయంలో పశ్చిమబెంగాల్, యూపీ, బీహార్, రాజస్థాన్ రాష్ర్టాలు అట్టడుగు స్థానాల్లో నిలిచాయని నివేదిక పేర్కొన్నది.
17 రాష్ర్టాల ఆర్థిక స్థితిగతులను అనుసరించి ఈ జాబితాను వెలువరించారు. ప్రధానంగా నాలుగు ఆర్థిక అంశాలను ఈ నివేదిక తయారీలో పరిగణనలోకి తీసుకున్నారు. ద్రవ్య లోటు, సొంత పన్నుల ఆదాయం, రాష్ట్ర అప్పుల స్థాయి, ఆదాయ రశీదులకు వడ్డీ చెల్లింపుల ఆధారంగా నివేదిక తయారైంది.