Desmond Tutu | దక్షిణాఫ్రికాలో జాతివివక్షకు వ్యతిరేకంగా పోరాటం సలిపిన హక్కుల కార్యకర్త, నోబెల్ బహుమతి గ్రహీత ఆర్చ్బిషప్ డెస్మండ్ టుటు అంత్యక్రియలు ముగిశాయి. ఆయన కోరిక ప్రకారం సంప్రదాయ పద్ధతిలో కాకుండా ఎకో ఫ్రెండ్లీ గా ఈ అంత్యక్రియలు జరిగాయి. నీటితో అంటే ఎక్వామెషిన్ పద్ధతిలో ఆయనకు అంత్యక్రియలు నిర్వహించారు. ఈ పద్ధతి ఎలక్ట్రిక్ క్రిమేషన్ వంటిదే అయినా, దీనిలో నీటిని వాడుతారు.
ఎక్వామెషిన్ పద్ధతి లేదా ఎల్కేలైన్ హైడ్రాలిసిస్ పద్ధతి. అంటే అగ్నితో శవానికి దహన సంస్కారాలు నిర్వహించే పద్ధతికి పూర్తి భిన్నంగా ఉంటుంది. ఈ పద్ధతిలో మృతదేహాన్ని నీరు, పొటాషియం హైడ్రాక్సైడ్ కలిసిన ద్రావణంలో ఉంచి, 150 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత వద్ద వేడి చేస్తారు. ఒక సిలిండర్ లాంటి పరికరంలో మూడు, నాలుగు గంటలు మృతదేహాన్ని వేడిచేస్తారు. ఈ పద్ధతిలో శరీరం మొత్తం ద్రావణంలా మారి, కేవలం ఎముకలు మాత్రమే మిగులుతాయి. ఆ ఎముకలను ఎండబెట్టి, వాటిని పొడి చేసి, బంధువులకు అప్పగించేస్తారు.
ఈ పద్ధతి 1990 లో ప్రారంభమైంది. ఇప్పటికీ చాలా దేశాల్లో ఇది వాడుకలో లేదు.దీనిని ఎక్కువగా ప్రయోగాల్లో ఉపయోగించిన జంతువులను దహనం చేయడానికే విరివిగా ఉపయోగించేవారు. తర్వాత తర్వాత అమెరికన్ వైద్య విద్యాలయాల్లో వాడుకలోకి తేవడం ప్రారంభించారు. ఆ తర్వాత మనుషుల అంత్యక్రియలకు కూడా వాడుతున్నారు.