పంజాబ్: అసెంబ్లీ ఎన్నికల్లో ఎదురు పక్షంపై పైచేయి సాధించేందుకు అన్ని పార్టీలు ఎవరికి తోచినట్లు వారు పథక రచన చేస్తున్నారు. ఎన్నికల్లో విజయం సాధించేందుకు చేయరాని ప్రయత్నాలన్నీ చేస్తున్నారు. తాజాగా పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఈ పైత్యం నశాలానికి అంటింది. లైంగికదాడి, హత్య కేసులో జైలు ఊచలు లెక్కపెడుతున్న డేరా బాబా గుర్మీత్ రాం రహీం సింగ్ను పెరోల్పై తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు ముమ్మరంగా సాగాయి. వీరి ప్రయత్నాలు ఫలించి ఎట్టకేలకు ఆయన జైలు నుంచి విడుదల అవుతున్నారు. డేరా బాబా పెరోల్పై వస్తుండటంతో.. పంజాబ్లోని 69 నియోజకవర్గాల్లో ఆయన ప్రభావం చూపనున్నారు. పెరోల్ తీసుకోవడం ప్రతి ఖైదీ హక్కు అని హర్యానా జైళ్ల శాఖ మంత్రి రంజిత్ సింగ్ చౌతాలా ప్రకటన చేసి రెండు రోజులు కూడా గడవక ముందే.. డేరా బాబాకు 21 రోజుల పెరోల్ లభించడం విశేషం.
ఇద్దరు సాద్వీలపై లైంగికదాడి, హత్య కేసులో డేరా సచ్చా సౌదా చీఫ్ గుర్మీత్ రాం రహీం సింగ్.. ప్రస్తుతం రోహతక్లోని సునారియా జైలులో శిక్ష అనుభవిస్తున్నారు. డేరా బాబా పెట్టుకున్న 21 రోజుల పెరోల్ దరఖాస్తును హర్యానా జైళ్ల శాఖ ఆమోదించింది. రోహ్తక్ కమిషనర్ సంతకం తర్వాత అతడిని సునారియా జైలు నుంచి బయటకు వస్తారు. సరిగ్గా పంజాబ్ ఎన్నికలకు 13 రోజుల ముందుగా ఆయనకు పెరోల్ దొరికింది.
పెరోల్పై వస్తున్న డేరా బాబాకు పంజాబ్లోని 23 జిల్లాల్లో 300 డేరాలు ఉన్నాయి. ఈ డేరాలు రాష్ట్ర రాజకీయాల్లో ప్రత్యక్షంగా పాల్గొంటాయి. పంజాబ్లోని మజా, మాల్వా, దోబా ప్రాంతాలపై ఆధిపత్యం చెలాయిస్తున్నాయి. డేరా బాబా పెరోల్పై జైలు నుంచి బయటకు వస్తుండటంతో త్వరలో జరుగనున్న పంజాబ్ ఎన్నికల్లో ఆయన ప్రభావం చూపనున్నారు. పంజాబ్లోని దాదాపు 69 స్థానాల్లో ఆయన ప్రభావం చూపుతారని పరిశీలకులు అంటున్నారు. గుర్మీత్ రాం రహీం విడుదల నేపథ్యంలో సునారియా జైలు వెలుపల భద్రతను కట్టుదిట్టం చేశారు.