న్యూఢిల్లీ, ఆగస్టు 12: డాలర్ విలువతో పోలిస్తే రూపాయి పతనం, విదేశీ వర్సిటీల్లో ఫీజుల పెరుగుదల, ప్రపంచ దేశాలను వెంటాడుతున్న ఆర్థిక సంక్షోభ భయాలు.. వీటి ప్రభావం విదేశాలకు వెళ్లే భారత విద్యార్థులపై ఎంతమాత్రం చూపడంలేదని ‘లోకల్ సర్కిల్స్’ తాజా సర్వేలో వెల్లడించింది. 34 వేల మందిపై జూలైలో ఈ సర్వే నిర్వహించారు.
రానున్న ఐదేండ్లలో వేటిపై ఖర్చు చేయడానికి ఎక్కువగా ఇబ్బంది పడుతారని అడిగిన ప్రశ్నకు పలువురు వివిధ కారణాలను చెప్పినప్పటికీ, విదేశీ విద్య తమకు భారం కాబోదని మెజారిటీ ప్రజలు తెలిపారు. ఉన్నత విద్య కోసం ప్రస్తుతం బ్యాంకుల్లో రుణాలు (రూపాయల్లో) తీసుకున్నప్పటికీ, చదువు పూర్తయ్యాక ఉద్యోగంలో చేరి డాలర్లలో సంపాదించడం తమకు కలిసొస్తుందని విద్యార్థులు అభిప్రాయపడ్డారు. భారత విద్యాసంస్థలతో పోలిస్తే ఆస్ట్రేలియా, కెనడా, యూకే, అమెరికా విద్యా సంస్థల్లో చదివిన వారిని ఎక్కువ మొత్తంలో చెల్లించి కంపెనీలు ఉద్యోగాల్లోకి తీసుకుంటున్నట్టు వివరించారు.