న్యూఢిల్లీ: జర్మనీలో బెర్లిన్లో ఇంటర్నేషనల్ యూనివర్సిటీలో చేరిన చాలా మంది విద్యార్థుల కలలు కల్లలవుతున్నాయి. వీసా నోటీసులు, కోర్టు అప్పీళ్లు, డిపోర్టేషన్ భయాలతో వణికిపోతున్నారు. విద్యార్థులు విద్యా రుణాలు తీసుకుని, లక్షలాది రూపాయల ట్యూషన్ ఫీజులు చెల్లించారు. అయితే, తమను జర్మనీ నుంచి వెళ్లిపొమ్మంటున్నారని కొందరు విద్యార్థులు చెప్పారు. దీనికి కారణం వారు చట్టాన్ని ఉల్లంఘించడం కాదని, ఇమిగ్రేషన్ అధికారులు వీరి యూనివర్సిటీ ప్రోగ్రామ్లను వేరొక రకంగా నిర్వచించడమేనని యూరోన్యూస్ కథనం పేర్కొన్నది. ఇంత హఠాత్తుగా తమ లీగల్ స్టేటస్ ఏవిధంగా పతనమైందని విద్యార్థులు ఆవేదన చెందుతున్నారు.
అడకత్తెరలో పోక చెక్కలు
భారతీయ విద్యార్థులకు ఈ పరిణామాలు తీవ్రమైనవే. చాలా మంది భారత దేశంలో విద్యా రుణాలు తీసుకుని, ఒకొక్కరు రూ.21.15 లక్షలు చొప్పున ఖర్చు చేశారు. భారత దేశం నుంచి దూర విద్యా విధానంలో ఈ చదువులు కొనసాగించవచ్చునని కొందరు విద్యార్థులకు చెప్తున్నారు. కానీ వీరికి మొదట్లో ఇచ్చిన హామీ ప్రకారం ఆన్-క్యాంపస్ జర్మన్ ఎడ్యుకేషన్ అందిస్తామని జర్మన్ విద్యా సంస్థలు హామీ ఇచ్చాయి. ప్రస్తుత పరిణామాలు అమెరికా, బ్రిటన్ల కన్నా జర్మనీ విద్య అందుబాటులో ఉంటుందనే నమ్మకాన్ని వమ్ము చేస్తున్నాయి. యూనివర్సిటీ లివింగ్ కో-ఫౌండర్, సీవోవో మయాంక్ మహేశ్వరి మాట్లాడుతూ, అడ్మిషన్లు, ఫీజు చెల్లింపుల గురించి మాత్రమే కాకుండా, ప్రోగ్రామ్ రికగ్నిషన్, బోధనా పద్ధతి, హాజరు అవసరాలు, వీసా అర్హత వంటి వాటిని కూడా క్షుణ్ణంగా తనిఖీ చేసుకోవాలని చెప్పారు. హైబ్రిడ్, ఫ్లెక్సిబుల్ లెర్నింగ్ ఫార్మాట్స్ ఈ రోజుల్లో సాధారణంగా మారిపోయాయన్నారు. ఈ కోర్సులు వ్యవస్థల నియమ, నిబంధనలకు, వీసా నిబంధనలకు ఏ విధంగా అనుగుణంగా ఉంటాయో తెలుసుకోవాలని చెప్పారు. నిబంధనల ప్రకారం అవసరమైనవి ఏమిటో, త్వరగా వెల్లడిస్తే విద్యార్థుల జీవితాల్లో అనిశ్చితిని తగ్గించవచ్చునన్నారు.