జైపూర్: పాకిస్థాన్కు చెందిన హిందూ దళిత కుటుంబం అక్కడ వేధింపులు తాళలేక అతి కష్టం మీద భారత్ చేరుకుంది. పాక్ సింధ్ ప్రావిన్స్లోని మీర్పూర్ ఖాస్కు చెందిన 10 మంది హిందూ దళిత కుటుంబ సభ్యులకు అక్కడ వేధింపులు, బెదిరింపులు పెరిగాయి. ఆ కుటుంబంలోని ఒక వ్యక్తిని పాక్ అధికారులు అరెస్ట్ చేశారు. గత ఏడాది సెప్టెంబర్లో విడుదల తర్వాత అతడ్ని కొందరు కిడ్నాప్ చేశారు. డబ్బులు ఇవ్వాలని లేకపోతే ఆ కుటుంబంలోని మహిళలపై అత్యాచారం చేస్తామని బెదిరించారు. అయితే ఆ కుటుంబం వద్ద డబ్బులు లేవని తెలుసుకుని 47 రోజుల తర్వాత అతడ్ని వదిలేశారు.
ఈ నేపథ్యంలో వేధింపులు, బెదిరింపులు భరించలేక రాజస్థాన్లోని బార్మర్లో తమ బంధువుల వద్దకు వెళ్లాలని ఆ హిందూ దళిత కుటుంబం నిర్ణయించింది. దీని కోసం భారత వీసాకు దరఖాస్తు చేయగా తిరస్కరించారు. దీంతో గత ఏడాది డిసెంబర్9న ఆరుగుల మహిళలున్న ఆ కుటుంబం దుబాయ్ వెళ్లింది. అక్కడి నుంచి భారత వీసాకు దరఖాస్తు చేయగా అది కూడా తిరస్కరణకు గురైంది. దీంతో ఆ కుటుంబం డిసెంబర్ 16న దుబాయ్ నుంచి నేపాల్కు చేరింది. అయితే మరోసారి వీసాను తిరస్కరించారు.
దీంతో ఈ ఏడాది ఫిబ్రవరి 25న నేపాల్లోని స్థానిక వ్యక్తి సహాయంలో భారత్ సరిహద్దుకు చేరారు. అక్కడి నుంచి 12 కిలోమీటర్లు నడిచి సరిహద్దును దాటి భారత్లోకి ప్రవేశించారు అనంతరం ఉత్తరప్రదేశ్లోని గొరఖ్పూర్కు, అక్కడి నుంచి 27న జోధ్పూర్కు మరునాడు బార్మర్కు చేరుకున్నారు.
మరోవైపు ఆ కుటుంబం అక్కడ నివసించడం అక్రమమని, ఇది తెలిస్తే వారిని అరెస్ట్ చేస్తారని స్థానికులు చెప్పారు. దీంతో ఏప్రిల్ 23న స్థానిక విదేశీ కార్యాలయానికి వెళ్లారు. పాక్లో వేధింపులు తాళలేక అతి కష్టం మీద బార్మర్కు చేరుకున్నట్లు తెలిపారు. కాగా, పాక్ నుంచి వలస వచ్చే వారు దేశంలో ఉండేందుకు నిబంధనలు అనుమతిస్తాయని పోలీస్ అధికారి చెప్పారు. అయితే కేంద్ర హోంమంత్రిత్వ శాఖ నుంచి దీనిపై స్పష్టత రావాల్సి ఉందన్నారు.