బీహార్ : కోర్టు బెయిల్ నిరాకరించడంతో పోలీసుల కళ్లు గప్పి ఏడుగురు నిందితులు ఏకంగా కోర్టు ఆవరణ నుంచి పరారయ్యారు. పట్నా జిల్లాలోని దన్పూర్లో ఈ ఘటన జరిగింది. విద్యుత్ సరఫరా వివాదంలో పోలీసులు ఏడుగురిని అరెస్టు చేశారు. మంగళవారం నిందితులను దన్పూర్ సివిల్ కోర్టు ఎదుట ప్రవేశపెట్టడంతో వారికి కోర్టు బెయిల్ నిరాకరించింది. నిందితులను జ్యుడీషియల్ రిమాండ్కు తరలించాలని పోలీసులను ఆదేశించింది. దీంతో పోలీసులు వారిని జైలుకు తరలించేందుకు వాహనాన్ని తీసుకువచ్చేందుకు వెళ్లగా ఏడుగురు వారి దృష్టి మరల్చి కోర్టు ఆవరణ నుంచి పరారయ్యారు. నిందితుల కోసం ప్రత్యేక పోలీసు బృందాలు గాలిస్తున్నాయి. పోలీసులు నిర్లుప్తంగా వ్యవహరించిన కారణంగానే నిందితులు తప్పించుకున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి.