న్యూఢిల్లీ, మార్చి 7: కాలం చెల్లిన ఉపగ్రహాలను అంతరిక్షంలోనే కూల్చేస్తాయి కొన్ని దేశాలు. ఇలా చేయడం వల్ల వాటి శకలాలు భవిష్యత్తులో భూమికి ప్రమాదంగా మారే అవకాశం ఉంటుంది. అందుకే, ఈ విషయంలో భారత్ బాధ్యతగా వ్యవహరించింది. మేఘ-ట్రోపికస్-1 (ఎంటీ1) అనే కాలం చెల్లిన ఉపగ్రహాన్ని పూర్తి నియంత్రిత విధానంలో ఎలాంటి ప్రమాదం లేకుండా సముద్రంలో పడేలా కూల్చివేసింది. అంతరిక్షంలోనే ఉపగ్రహాన్ని కూల్చివేసే సామర్థ్యం భారత్కు ఉన్నా కూడా అంతరిక్ష శకలాలపై ఐక్యరాజ్యసమితి ఇంటర్ ఏజెన్సీ స్పేస్ డెబ్రిస్ కోఆర్డినేషన్ కమిటీ రూపొందించిన మార్గదర్శకాల పట్ల నిబద్ధతతో ఎంటీ1ను నియంత్రిత విధానంలో పసిఫిక్ మహాసముద్రంలో మంగళవారం సాయంత్రం కూల్చివేసింది.
ఉష్ణమండల వాతావరణంపై అధ్యయనం చేయడానికి భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ(ఇస్రో), ఫ్రాన్స్ స్పేస్ ఏజెన్సీ(సీఎన్ఈఎస్) కలిసి మేఘ-ట్రోపికస్-1 ప్రయోగాన్ని చేపట్టాయి. దీని బరువు దాదాపు వెయ్యి కిలోలు. 2011 అక్టోబర్ 12న దీనిని ప్రయోగించారు. వాస్తవానికి దీని కాల పరిమితి మూడేండ్లే. కానీ, ఇది దాదాపు పదేండ్ల పాటు (2021 వరకు) సేవలు అందించింది.
మేఘ-ట్రోపికస్-1 కూల్చివేతలో ఇస్రో అనేక సవాళ్లను ఎదుర్కొన్నది. దీనిని ముందుగా నియంత్రిత భూకక్షలోకి తీసుకువచ్చి కూల్చేయాలి. కానీ, ఈ ఉపగ్రహాన్ని ఇందుకు అనుగుణంగా రూపకల్పన చేయలేదు. ఈ ఉపగ్రహానికి భూవాతావరణంలోకి ప్రవేశించే క్రమంలో ఉండే ఘర్షణలను తట్టుకునే సామర్థ్యం సైతం లేదు. ఇలాంటి అన్ని సవాళ్లను అధిగమించి మంగళవారం రాత్రి పూర్తి నియంత్రిత పద్ధతిలో ఉపగ్రహాన్ని కూల్చివేసింది.