న్యూఢిల్లీ, ఆగస్టు 16: కనీస వేతనం, ఉద్యోగ భద్రత వంటి కీలక అంశాల సాధనే లక్ష్యంగా నేషనల్ ఎంప్లాయ్మెంట్ పాలసీని (జాతీయ ఉపాధి విధానం) చట్టబద్ధం చేయాలని డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలో దేశవ్యాప్తంగా 200 సివిల్ సొసైటీ ఆర్గనైజేషన్లకు చెందిన దాదాపు 2 వేల మంది ప్రతినిధులు తిరంగా మార్చ్ను నిర్వహించారు.
సంయుక్త రోజ్గార్ ఆందోళన్ సమితి నేతృత్వంలో దేశ రాజధాని ఢిల్లీలోని నంద్ నగ్రీలో మంగళవారం ఈ యాత్ర ప్రారంభమైంది. అయితే, జంతర్మంతర్ వరకు కొనసాగాల్సిన ఈ యాత్రను గోకుల్ పురీ వద్దే పోలీసులు అడ్డుకున్నారని ఢిల్లీ క్యాబినెట్ మంత్రి, దేశ్ కీ బాత్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు గోపాల్ రాయ్ మండిపడ్డారు. ‘నేషనల్ ఎంప్లాయ్మెంట్ పాలసీని అమలు చేయాలని డిమాండ్ చేస్తూ చేపట్టిన ఈ ఉద్యమం ఆగస్టు 22 వరకు కొనసాగాల్సి ఉన్నది. అయితే దీన్ని పోలీసులు అడ్డుకున్నారు.
తిరంగా యాత్ర దేశవ్యాప్తంగా కొనసాగుతున్నది. దానికి ఎలాంటి అడ్డంకులు సృష్టించట్లేదు. అయితే, తిరంగా యాత్రలో ఉపాధి గురించి ప్రశ్నిస్తే అడ్డుకుంటున్నారు’ అని మండిపడ్డారు. ఎన్ని అవాంతరాలు సృష్టించినా తమ ఉద్యమం కొనసాగుతుందని పేర్కొన్నారు. ఉద్యోగాల సృష్టి జరుగకపోతే, అభివృద్ధి అనేదే ఉండదని అన్నారు. దేశంలో నిరుద్యోగ సమస్య పెరిగిపోయిందని, దాన్ని పరిష్కరించడానికి నేషనల్ ఎంప్లాయ్మెంట్ పాలసీని అమలు చేయడమే మార్గమన్నారు.
ఏమిటీ నేషనల్ ఎంప్లాయ్మెంట్ పాలసీ?
దేశంలో నెలకొన్న నిరుద్యోగ సమస్యను రూపుమాపడానికి ‘10 ఎం ఫార్ములా’ పేరిట దేశ్ కీ బాత్ ఫౌండేషన్ ఈ పాలసీని రూపొందించింది. దేశంలోని ప్రఖ్యాత ఎకనమిక్ ప్రొఫెసర్లు, రిసెర్చ్ స్కాలర్లు, నిపుణులను సంప్రదించి దీన్ని తీసుకొచ్చారు. నిరుద్యోగులకు శిక్షణ, పరిశ్రమల ఏర్పాటు, ఉత్పత్తి పెంచడం, ఉద్యోగ భద్రతే ప్రాథమ్యాలుగా ఈ పాలసీని తయారుచేశారు. ‘దేశంలో నిరుద్యోగం పెరిగిపోతున్న ది. దాన్ని రూపుమాపడానికే ఈ పాలసీ తీసుకొచ్చాం. త్వరలో కేంద్రానిఇక పాలసీ సమర్పిస్తాం. పార్లమెంట్లో దీన్ని ఆమోదించాలి’ అని రాయ్ డిమాం డ్ చేశారు.
తీసుకొచ్చే ఆలోచన లేదు: కేంద్రం
దేశంలో నిరుద్యోగ భూతాన్ని తరిమికొట్టేందుకు నేషనల్ ఎంప్లాయ్మెంట్ పాలసీ అత్యావశ్యకమని రాయ్ నొక్కి చెప్పారు. కేంద్రం సొంతగా పాలసీని తయారు చేసినా లేక తమ పాలసీలో సవరణలు చేసినా తమకు సమ్మతమేనన్నారు. అయితే, పాలసీని కచ్చితంగా తీసుకురావాలని పేర్కొన్నారు. కాగా గత నెల పార్లమెంట్ సమావేశాల్లో కేంద్ర కార్మిక, ఉపాధి శాఖ మంత్రి భూపేందర్ యాదవ్ మాట్లాడుతూ.. నేషనల్ ఎంప్లాయ్మెంట్ పాలసీని తీసుకొచ్చే యోచన ప్రభుత్వానికి లేదని చెప్పడం గమనార్హం.