న్యూఢిల్లీ: ఇండియాలో తొలిసారి కనిపించిన కరోనా వేరియంట్ వల్లే ఇండియాలో సెకండ్ వేవ్ వచ్చిందని ప్రభుత్వ అధ్యయనం తేల్చింది. బీ.1.612.2గా గతంలో పిలిచిన దీనినే ఈ మధ్య డబ్ల్యూహెచ్వో డెల్టా వేరియంట్గా గుర్తించిన విషయం తెలిసిందే. యూకేలోని కెంట్లో గుర్తించిన ఆల్ఫా వేరియంట్ కంటే కూడా ఇది వేగంగా వ్యాపించిందని ఈ అధ్యయనం స్పష్టం చేసింది. ఇండియన్ సార్స్ కొవ్2 జీనోమిక్ కాన్సార్షియా, నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ ఈ అధ్యయనం నిర్వహించింది.
నిజానికి ఆల్ఫా వేరియంట్ కంటే ఈ డెల్టా వేరియంట్ 50 శాతం ఎక్కువ వ్యాపించిందని ఈ అధ్యయనం స్పష్టం చేసింది. దేశంలో 12,200 వేరియంట్లు ఆందోళన కలిగించేవిగా ఉన్నాయని, తమ అధ్యయనం కొనసాగుతోందని ఈ సంస్థలు తెలిపాయి. అయితే డెల్టా వేరియంట్తో పోలిస్తే.. ఈ వేరియంట్ల ఉనికి చాలా చాలా తక్కువని చెప్పాయి. సెకండ్ వేవ్లో అన్ని ఇతర వేరియంట్లను ఈ డెల్టా వేరియంట్ రీప్లేస్ చేసిందని ఈ అధ్యయనం తేల్చింది.
తెలంగాణలోనూ ఎక్కువే
ఈ డెల్టా వేరియంట్ దాదాపు అన్ని రాష్ట్రాల్లోనూ కనిపించింది. అయితే ముఖ్యంగా తెలంగాణతోపాటు ఢిల్లీ, ఆంధ్రప్రదేశ్, గుజరాత్, మహారాష్ట్ర, ఒడిశాల్లో ఎక్కువగా ఉన్నట్లు తేలింది. వ్యాక్సిన్లు వేసుకున్న తర్వాత కూడా వచ్చిన ఇన్ఫెక్షన్లలో ఈ డెల్టా వేరియంట్ ప్రభావమే ఎక్కువగా ఉంది. అదే ఆల్ఫా వేరియంట్ మాత్రం వ్యాక్సిన్ వేసుకున్న తర్వాత రాలేదు. అయితే డెల్టా వేరియంట్ వల్ల ఎక్కువ మరణాలు, వ్యాధి తీవ్రత ఎక్కువైనట్లు మాత్రం నిరూపితం కాలేదు. ఈ అధ్యయనంలో భాగంగా ఇండియాలో చేసిన 29 వేల జీనోమ్ సీక్వెన్సింగ్లను పరిశీలించారు. ఇందులో 8900 శాంపిల్స్లో బీ.1.617 కనిపించింది. అందులో డెల్టా వేరియంట్ వెయ్యి శాంపిళ్లలో ఉన్నట్లు గుర్తించారు.