ముంబై : మహారాష్ట్రలో తాజాగా మరో పది డెల్టా ప్లస్ వేరియంట్ కేసులు నమోదయ్యాయని రాష్ట్ర ఆరోగ్య శాఖ అధికారులు సోమవారం వెల్లడించారు. వీటిలో ఆరు కేసులు కొల్హాపూర్లో, రత్నగిరిలో మూడు కేసులు, సింధుదుర్గ్లో ఒక కేసు వెలుగుచూశాయని చెప్పారు. ఈ కేసులతో మహారాష్ట్రలో డెల్టా ప్లస్ కేసుల సంఖ్య 76కు చేరుకుంది.
తొలి డెల్టా ప్లస్ వేరియంట్ రోగి రత్నగిరి జిల్లాకు చెందిన 80 ఏండ్ల వ్యక్తి కాగా, కొవిడ్-19తో ఈ ఏడాది జూన్లో ఆయన మరణించారు. ఇక డెల్టా ప్లస్ వేరియంట్ సోకిన వారితో సన్నిహితంగా మెలిగిన వారిని అధికారులు గుర్తించి పరీక్షలు నిర్వహిస్తున్నారు. డెల్టా ప్లస్ రోగుల ప్రయాణ వివరాలు, వ్యాక్సినేషన్, ఆరోగ్య పరిస్థితి వంటి వివరాలను ఆరా తీస్తున్నారు.