న్యూఢిల్లీ, నవంబర్ 17: సంచలనం సృష్టించిన శ్రద్ధా వాకర్ హత్య కేసు నిందితుడు ఆఫ్తాబ్కు నార్కో టెస్ట్ నిర్వహించేందుకు ఢిల్లీలోని సాకేత్ కోర్టు అనుమతి ఇచ్చింది. గురువారంతో నిందితుడి కస్టడీ ముగియటంతో పోలీసులు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కోర్టు ముందు అతడిని హాజరుపరిచారు. మరిన్ని ఆధారాలు సేకరించేందుకు పది రోజుల కస్టడీ పొడిగించాలని కోరగా, ఐదు రోజుల కస్టడీకి కోర్టు అనుమతిచ్చింది. శ్రద్ధ, ఆఫ్తాబ్ ఢిల్లీకి మకాం మార్చే ముందు విహార యాత్ర కోసం హిమాచల్ప్రదేశ్కు వెళ్లటంతో నిందితుడిని అక్కడికి తీసుకెళ్లి పలు ఆధారాలు సేకరించనున్నారు.
ఇప్పటి వరకు శ్రద్ధాను చంపేందుకు నిందితుడు వాడిన కత్తి, ఆమె మొబైల్ ఫోన్ను పోలీసులు గుర్తించలేకపోయారు. హత్య సమయంలో ప్రత్యక్ష సాక్షి ఎవరూ లేకపోవటంతో నార్కో టెస్ట్ ద్వారా మరింత సమాచారం సేకరించి, నిందితుడికి శిక్ష పడేలా చేయొచ్చని న్యాయ నిపుణులు పేర్కొంటున్నారు. నిందితుడిని కోర్టుకు తీసుకొస్తారని తెలిసి గురువారం సాయంత్రం లాయర్లు పెద్ద ఎత్తున గుమిగూడారు. ఆఫ్తాబ్ను ఉరి తీయాలంటూ నినాదాలు చేశారు. దీంతో అతడిపై దాడి చేసే అవకాశం ఉన్నదని అనుమానించిన పోలీసులు వీడియోకాన్ఫరెన్స్ ద్వారా కోర్టు ఎదుట హాజరుపరిచారు. అటు.. శ్రద్ధాకు చెందిన 13 ఎముకలను పోలీసులు స్వాధీనం చేసుకొన్నారు. డీఎన్ఏ పరీక్షల ద్వారా వీటిని గుర్తించనున్నారు.
శ్రద్ధా వాకర్ హత్యపై కేంద్ర మంత్రి కౌశల్ కిశోర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ హత్యకు ఆ అమ్మాయిదే (శ్రద్ధావాకర్) బాధ్యత అని పేర్కొన్నారు. ఉత్తరప్రదేశ్లో నిర్వహించిన ఓ కార్యక్రమంలో కౌశల్ కిశోర్ మాట్లాడుతూ.. సహజీవనాలు చివరికి ముగిసే స్నేహాలు మాత్రమేనని అన్నారు. తల్లిదండ్రులకు వ్యతిరేకంగా నడుచుకునే ముందు చదువుకున్న అమ్మాయిలు, చదువుకోని అమ్మాయిల నుంచి ఎంతో నేర్చుకోవాలన్నారు. తల్లిదండ్రుల కోరిక మేరకే ఓ వ్యక్తితో జీవించాలన్నారు. ఈ వ్యాఖ్యలపై మహిళా సంఘాలు మండిపడ్డాయి.