న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీ కొత్త పోలీస్ కమిషనర్గా సంజయ్ అరోరా నియమితులయ్యారు. ప్రస్తుత ఢిల్లీ పోలీస్ బాస్ రాకేష్ అస్థానా స్థానంలో ఆగస్ట్ 1న బాధ్యతలు స్వీకరిస్తారు. 2025 జూలై 31 లేదా తదుపరి ఉత్తర్వుల వరకు ఆయన ఆ పదవిలో కొనసాగుతారని కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఆదివారం తెలిపింది. తమిళనాడు కేడర్కు చెందిన ఐపీఎస్ అధికారి సంజయ్ అరోరా ప్రస్తుతం ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ (ఐటీబీపీ) డైరెక్టర్ జనరల్గా ఉన్నారు. దీంతో సశాస్త్ర సీమ బల్ డైరెక్టర్ జనరల్ ఎస్ఎల్ థాయోసెన్కు ఐటీబీపీ అదనపు బాధ్యతలు అప్పగించారు.
కాగా, అరుణాచల్ ప్రదేశ్-గోవా-మిజోరం-కేంద్రపాలిత ప్రాంతం (ఏజీఎంయూటీ) కేడర్ వెలుపల నుంచి దేశ రాజధాని ఢిల్లీ పోలీస్ కమిషనర్గా నియమితులైన మూడో అధికారి సంజయ్ అరోరా. 1988 బ్యాచ్ ఐపీఎస్ అధికారి అయిన ఆయన, జైపూర్లోని మాల్వియా నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్లో బ్యాచిలర్ డిగ్రీ పట్టా పొందారు.
అనంతరం ఐపీఎస్లో చేరిన తర్వాత తొలుత తమిళనాడులో వివిధ హోదాల్లో పనిచేశారు. కోయంబత్తూరు నగర పోలీస్ అధిపతిగా, చెన్నైలో క్రైమ్, ట్రాఫిక్ అదనపు కమిషనర్గా కూడా ఉన్నారు. డకాయిట్ వీరప్పన్, అతడి ముఠాను పట్టుకునేందుకు నియమించిన టాస్క్ఫోర్స్లో కీలకంగా వ్యవహరించారు. దీంతో ఆయనకు సీఎం గ్యాలెంట్రీ మెడల్ కూడా లభించింది.
మరోవైపు సంజయ్ అరోరా ఐటీబీపీలో పనిచేసిన సమయంలో 2000 నుంచి 2002 వరకు ముస్సోరీలోని ఫోర్స్ అకాడమీలో బోధకుడిగా కూడా ఉన్నారు. గత ఏడాది ఆగస్ట్లో ఐటీబీపీ చీఫ్గా నియమితులయ్యారు. ఆయన విశిష్ట సేవలకుగాను రాష్ట్రపతి పోలీసు పతకం, ఇతర గౌరవాలతో పాటు యూఎన్ శాంతి పరిరక్షక పతకం కూడా లభించింది.